- 2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించిన మంత్రిమండలి.
- నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం.
- డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల.
- నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం.
- ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల.
- ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి.
- అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం.
- ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
- మూడు కీలక బిల్లులకు ఆమోదం
ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓట్ ఆన్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన బుధవారం ప్రవేశపెట్టారు. కాగా, మూడు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్ (బదిలీ నిషేధ సవరణ బిల్లు) -2024, ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 బిల్లులను ప్రవేశ పెట్టగా కేబినెట్ ఆమోదం తెలిపింది.
- అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం ఎక్కిన టీడీపీ సభ్యులు.. వాయిదా తీర్మానం పై పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ పై కాగితాలు చించి విసిరిన టీడీపీ సభ్యులు.. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు.. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు ఆమోదం.
- టీడీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ
మూడో రోజు ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. రైతు సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ నేపథ్యంలో పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు ఆమోదం తెలిపారు.
- ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ను మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టారు. కాగా ఓట్ ఆన్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. విద్య, వైద్యం, మహిళా సాధికారత, వృద్ధులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పిస్తున్నామన్నారు. చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అన్నారు. నిస్సహాయ పేద వర్గాలే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యత అన్నారు.