ప్రజాశక్తి-బొబ్బిలి : రోడ్డుపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు హెచ్చరించారు. పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, మిలటరీ కాలనీ, బోస్ నగర్, రాజ్ మహల్ ప్రాంతాల్లో గురువారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులకు చెత్త అందించాలని ప్రజలను కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే జరిమానా విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ శివను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై చెత్త ఉండడంతో శుభ్రం చేయాలన్నారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.