గుంటూరు జిల్లాలో దారుణం

Feb 14,2024 09:00 #Bad, #Guntur District
  • చిన్నారిని రాయితో మోది హత్య
  • ఆపై పెట్రోల్‌ పోసి దహనం
  • ప్రియుడితో కలిసి ఓ తల్లి ఘాతుకం

ప్రజాశక్తి – తాడికొండ (గుంటూరు జిల్లా) : తనను తీసుకెళ్తుందని తన తల్లే అని అనుకున్నది…కానీ ఆమె మేకవన్నే పులి అని అభం శుభం తెలియని ఆ చిన్నారి మనస్సుకు అర్థం కాలేదు. నిలువెళ్లా కాపట్యం నిండిన ఆ మృగం తనను చిదిమేస్తుందని ఊహించలేకపోయింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని బండరాయితో మోది ఆ చిన్నారిని హతమార్చింది. ఆపై తన ప్రియుడితో కలిసి పెట్రోల్‌ పోసి దహనం చేసింది. సమాజంలో మానవ విలువలు దిగజారిపోతున్నాయనడానికి ఈ ఘోరకలి నిదర్శనమని పలువురు అసహ్యించుకుంటున్నారు. ఈ దారుణ ఘటనను గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా అలూరి మండలానికి చెందిన కౌతాళం సిద్ధార్థ హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తుండేవారు. లాలాగూడకు చెందిన జంగంపల్లి స్వప్నతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆరు నెలల కిందట స్వప్న తన కుమార్తె నేహతో కలిసి సిద్ధార్థ వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి నెల రోజుల క్రితం తాడికొండ మండలం బండారుపల్లికి వచ్చారు. వివాహేతర సంబంధానికి చిన్నారిఅడ్డుగా ఉందని ప్రియుడు భావించాడు. ఇదే విషయాన్ని ప్రియురాలికి చెప్పాడు. ప్రియుడి మోజులో పడిన ఆమె తన మాతృత్వాన్ని మరచి చిన్నారిని హతమార్చేందుకు నిర్ణయించుకుంది. తల్లే మృగంలా మారి హతమార్చుతుందని పసిగట్టని ఆ చిన్నారి తన తల్లిఒడిలో నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి సమయంలో బండరాయితో మోది చిన్నారిని తల్లి హతమార్చింది. అనంతరం ప్రియుడితో కలిసి సమీపంలోని రైల్వే ట్రాక్‌ పక్కన పెట్రోల్‌ పోసి దహనం చేశారు. మంగళవారం అటుగా వెళ్లిన వారికి పాప మృతదేహం పాక్షికంగా దగ్ధమై కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు స్వప్న, సిద్ధార్థను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంగానే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

➡️