దేశంలో అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్‌ 

Dec 20,2023 10:18 #Richest, #Women
Asia Has New Richest Woman - India's Savitri Jindal

టాప్‌ 5 శతకోటీశ్వర్ల జాబితాలో చోటు

ఈ ఏడాది అదానీ, అంబానీలకంటే అధిక ఆర్జన

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సంపన్నులు ఎవరంటే, ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు అంబానీ, అదానీలవే. కానీ ఈ ఏడాది భారత్‌లో అత్యధిక సంపదను ఆర్జించిన వ్యక్తుల జాబితాలో జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఎకనామిక్‌ టైమ్స్‌ సంస్థకు చెందిన బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం, ఆమె ఈ ఏడాది ఏకంగా దాదాపు రూ.7.97 లక్షల కోట్లు (9.6 బిలియన్‌ డాలర్లు) సంపాదించారు. దీంతో 25.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆమె భారత్‌లోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా నిలిచారు. అంతేకాదు దేశంలోని అగ్రశ్రేణి శతకోటీశ్వర్ల జాబితాలో 5వ వ్యక్తిగా రికార్డులకెక్కారు. జిందాల్‌ గ్రూప్‌ను స్థాపించిన ఓంప్రకాశ్‌ జిందాల్‌ భార్యయే సావిత్రి జిందాల్‌. ఆయన మరణానంతరం, సావిత్రి జిందాల్‌ ‘ఓపీ జిందాల్‌ గ్రూప్‌’ ఛైరపర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌ లాంటి పలు కంపెనీలు ఉన్నాయి. ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లో.. ఈ జిందాల్‌ గ్రూప్‌ కంపెనీల షేర్లు అన్నీ భారీ లాభాలు ఆర్జించాయి. దీంతో సావిత్రి జిందాల్‌ సంపద అమాంతం పెరిగింది. ఫలితంగా భారతదేశంలోని కుబేరుల జాబితాలో ఆమె ఐదో స్థానానికి చేరుకున్నారు. అగ్రశ్రేణి శతకోటీశ్వర్లు వీరే బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం, దేశంలో ఈ ఏడాది అత్యధికంగా కోట్లు గడించినవారిలో హెచ్‌సిఎల్‌ టెక్‌ అధినేత శివ్‌నాడార్‌ 8 బిలియన్‌ డాలర్లతో 2వ స్థానంలో నిలిచారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డిఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ కెపి సింగ్‌ 3వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాదిలో ఆయన సంపద 7.15 బిలియన్‌ డాలర్లు మేర పెరిగింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ బిర్లా, షాపూర్‌ మిస్త్రీ 6.3 బిలియన్‌ డాలర్ల సంపదతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.అంబానే నబంర్‌ వన్‌ అపరకుబేరుడు, రిలయన్స్‌ సంస్థల అధినేత ముకేశ్‌ అంబానీ సంపద ఈ ఏడాది 5.2 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అయినప్పటికీ ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు. అయితే భారత్‌లో నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకారు. ఆయన మొత్తం ఆర్జన 92.3 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్‌ మిత్తల్‌ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. అదానీకి గండిపడింది! హిండెన్‌బర్గ్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం, ఈ ఏడాది అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. దీనితో గౌతమ్‌ అదానీ సంపద భారీగా తగ్గిపోయింది. దీంతో ఆయన ఆదాయానికి 35.4 బిలియన్‌ డాలర్ల మేర గండిపడింది. కానీ ఆయన మొత్తం సంపద 85.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దీంతో ఆయన ఇప్పటికీ భారత్‌లో రెండో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.

➡️