జెఎన్‌యులో రెచ్చిపోయిన ఎబివిపి కార్యకర్తలు

Feb 11,2024 08:39 #ABVP activists, #JNU, #New Delhi
  • ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులపై దాడి – పలువురికి గాయాలు

న్యూఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం ఎబివిపి మరోమారు కండకావరాన్ని ప్రదర్శించింది. గుర్తింపు విద్యార్థి సంఘం ఎన్నికల ముందు శుక్రవారం సాయంత్రం యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహిస్తుండగా.. మారణాయుధాలతో సమావేశ మందిరంలోకి చొచ్చుకొచ్చిన ఎబివిపి కార్యకర్తలు విచక్షణరాహిత్యంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఎస్‌ఎఫ్‌ఐ నేత, జెఎన్‌యు అధ్యక్షులు ఐషి ఘోష్‌తో సహా పలువురు గాయపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, పరిశోధక విద్యార్థి ఉన్మేష్‌ తలపై తీవ్ర గాయమైంది. ఎన్నికలు జరిగితే ఘోర పరాజయం తప్పదన్న భయంతోనే క్యాంపస్‌లో ఎబివిపి, కాషాయ మూకలు హింసకు తెరలేపారని ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాల నాయకులు విమర్శించారు. ఈ హింసాకాండ నేపథ్యంలో జనరల్‌ బాడీ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు ఐషి ఘోష్‌ తెలిపారు. ఛండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల తరహాలో ఇక్కడ విద్యార్థి గుర్తింపు సంఘ ఎన్నికలను కూడా రిగ్గింగ్‌ చేసేందుకు ఎబివిపి ప్రయత్నిస్తోందన్నారు. కాగా, ఢిల్లీ యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి ఎఐఎస్‌ఎ నిర్వహించిన కార్యక్రమంలోనూ ఎబివిపి కార్యకర్తలు విద్యార్థులపైనా, ఉపాధ్యాయులపైనా దాడులకు పాల్పడింది.

➡️