మళ్లీ మార్పులు చేర్పులు

Feb 29,2024 08:54 #ysrcp party
  •  ఐదు పేర్లతో వైసిపి ఎనిమిదో జాబితా 
  • గుంటూరు ఎంపి అభ్యర్థిగా కిలారు రోశయ్య
  • ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 
  • మూడోసారి మారిన జిడి నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరోఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి అధికార వైసిపి మార్పులు చేర్పులతో ఎనిమిదో జాబితాను బుధవారం విడుదల చేసింది. గుంటూరు పార్లమెంటుకు మొదట ఉమ్మారెడ్డి రమణ పేరును ప్రకటించిన వైసిపి ఇప్పుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను ప్రకటించింది. అలాగే ఒంగోలు పార్లమెంటు స్థానానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరును ప్రకటించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు మార్చిన గంగాధర నెల్లూరు అసెంబ్లీకి ముచ్చటగా మూడోసారి అభ్యర్థిని మార్చింది. ప్రస్తుతం జిడి నెల్లూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి స్థానంలో చిత్తూరు ఎంపి రెడ్డప్ప పేరును ప్రకటించారు. కె నారాయణస్వామి ఎంపిగా పోటీ చేయలేనని గట్టిగా పట్టుబట్టడంతో మళ్లీ నారాయణస్వామి పేరును ప్రకటించిన వైసిపి అధిష్టానం ఎనిమిదో జాబితాలో కొత్తగా కల్లత్తూరు కృపాలక్ష్మి పేరును ప్రకటించింది. గతంలో మానుగుంట మహిధర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుకూరు అసెంబ్లీకి మొదట కఠారి అరవిందా యాదవ్‌ పేరును ప్రకటించగా, ఇప్పుడు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావును ప్రకటించింది. పొన్నూరు అసెంబ్లీ స్థానాన్ని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు, కాంట్రాక్టరు అయిన అంబటి మురళికి కేటాయించింది.

➡️