ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ (ఎస్సి) ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్లో ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన 2019 ఎన్నికల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి వైసిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. ఎలీజాకు టికెట్ ఇవ్వకుండా కంభం విజయరాజుకు వైసిపి చింతలపూడి టికెట్ కేటాయించింది. దీంతో, కాంగ్రెస్ తరపున చింతలపూడి నుంచి పోటీ చేసేందుకు ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. మీడియాతో మాట్లాడిన ఆయన వైసిపికి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైసిపిని వీడటానికి చాలా కారణాలున్నాయని చెప్పారు. తనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని, అవమానపరిచారని తెలిపారు. స్థానికంగా నెలకొన్న కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశానని వివరించారు. కులాలు, మతాల ఆధారంగా కాంగ్రెస్ రాజకీయాలు చేయదని అన్నారు.