ప్రజాశక్తి-కలెక్టరేట్ (విశాఖ) : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ … అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు, ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో భారీ స్థాయిలో మహా పాదయాత్ర నిర్వహించారు. కూర్మన్నపాలెం వద్ద నుంచి చేపట్టిన మహా పాదయాత్ర, జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర సాగింది. వందలాదిమంది పాదయాత్రలో పాల్గన్నారు. ఉక్కు నిర్వాసితులు కూడా భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు జె.వి.సత్యనారాయణమూర్తి, స్టీల్ ప్లాంట్ లోని సిఐటియు యూనియన్ నాయకులు అయోధ్యరాం, గుర్తింపు యూనియన్ అధ్యక్షులు డి.ఆదినారాయణ, హెచ్ఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దొమ్మేసి అప్పారావు, నవభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు మంత్రి రాజశేఖర్, టిడిపి విశాఖ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కాంగ్రెస్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ రాకేష్ రెడ్డి, సిఐటియు నాయకులు ఎం.జగ్గు నాయుడు, ఆర్ కే ఎస్ వి.కుమార్, సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు నాయకత్వం వహించారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ స్థాయిలో బహిరంగ సభ జరిగింది.