Vja – పింఛను డబ్బులతో పరారైన సచివాలయ ఉద్యోగి

విజయవాడ : సచివాలయ ఉద్యోగి పింఛను డబ్బులతో పరారైన ఘటన విజయవాడలో జరిగింది. కృష్ణా పామర్రుకు చెందిన ఊటుకూరి నాగమల్లి విజయవాడ మధురానగర్‌లో ఉన్న 208వ నంబరు సచివాలయంలో అడ్మిన్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. నగర పాలక సంస్థ జోనల్‌ 2 లో విధులు నిర్వర్తిస్తున్న జోనల్‌ కమిషనర్‌ కంచర్ల ప్రభుదాసు ఈ నెల మూడో తేదీ సాయంత్రం 6 గంటలకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి రూ.5.41 లక్షలను నాగమల్లికి అందజేశారు. ఆ రోజు రాత్రి 8 గంటల వరకు నాగమల్లి మొత్తం 14 మంది లబ్ధిదారులకు రూ.42 వేలను పంపిణీ చేశాడు. మిగిలిన రూ.4.99 లక్షలను మర్నాడు ఉదయం నుంచి పంపిణీ చేయాల్సి ఉంది. అయితే నాగమల్లేశ్వరరావు నాలుగో తేదీ అందుబాటులో లేకుండాపోయాడు. అధికారులు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. దీంతో జోనల్‌ కమిషనర్‌ ప్రభుదాసు గుణదల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగమల్లిని విజయవాడలో గుర్తించిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడిని ప్రశ్నించగా ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్‌లు ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌లో డెల్లా 427 అనే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని బెట్టింగ్‌లు ఆడుతున్నట్లు సమాచారం. అతడిని అరెస్టు చేసిన పోలీసులు మొత్తం సొమ్మును అతడి కుటుంబ సభ్యుల నుంచి రికవరీ చేశారు. నాగమల్లిని రిమాండ్‌కు తరలించారు.

➡️