వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్‌ రెడ్డికి బెయిల్‌

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై వాదనల అనంతరం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు ప్రకటించింది. రూ.రెండు లక్షల పూచికత్తు సమర్పించాలని, ప్రతి సోమవారం సిసిఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. సిబిఐ కోర్టులో కేసు ట్రయిల్‌ జరిగే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉండకూడదని షరతు విధించింది. అలాగే ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని నిందితుడుగా గుర్తించిన పోలీసులు 2021 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన చంచల్‌గూడ జైలులో అండర్‌ ట్రైల్‌ ఖైదీగా ఉంటున్నారు. ఆయనకు బెయిల్‌ మంజూరు కావడంతో మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

➡️