ప్రజలకు నమస్కరిస్తున్న టిడిపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
‘విజన్ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే విజన్’ అని.. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని అనంతపురం అర్బన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో అధోగతిపాలైన రాష్ట్రాన్ని కాపాడలంటే అది ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఎందుకంటే చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి.. సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా ఇవ్వాలన్న దానిపై కచ్చితమైన ప్రణాళికతో ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే హామీలు ఇచ్చారన్నారు. తాము చెప్పిన ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు చేరుస్తామన్నారు. పింఛన్ల విషయంలో వైసిపి శవ రాజకీయాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో 29వేల మంది రైతులు.. 35వేల ఎకరాల భూమిని ఇచ్చారని, దీని ద్వారా రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రానికి గణనీయమైన ఆదాయాన్ని పొందే విధంగా చంద్రబాబు ప్రణాళిక చేశారన్నారు. కానీ జగన్రెడ్డి అధికారంలోకి వచ్చి అమరావతిని నాశనం చేశాడన్నారు. టిడిపి ప్రభుత్వం ఉద్యోగాలు, కళాశాలల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిందని గుర్తు చేశారు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో ముస్లిములపై దాడులు జరిగాయన్నారు. ఏప్రిల్ 4న నమాజ్ చేసి తిరిగి వస్తున్న ముస్లిం మహిళపై వైసిపి నేత శ్రీనివాసరెడ్డి దాడికి పాల్పడ్డాడన్నారు. మైనార్టీలపై వైసిపి చేస్తున్న అరాచకాల వల్ల మిస్బా, అబ్దుల్ సలీమ్ల కుటుంబం కూడా ప్రాణాలు కోల్పోయిందన్నారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ల అమలుకు టిడిపి హామీ ఇస్తోందన్నారు. ఐదేళ్ల కాలంలో వైసీపీ ముస్లింల కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేసిన జగన్రెడ్డి అధికారం దిగగానే.. టీడీపీ పక్కా ప్రణాళికతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని దగ్గుపాటి స్పష్టం చేశారు.