- పద్మశ్రీ వాపస్ఇస్తానని ప్రకటన
న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజరు సింగ్ ఎన్నికను నిరసిస్తూ తాజాగా డెఫ్ఒలింపిక్స్ విజేత వీరేందర్ సింగ్ యాదవ్ గళం విప్పారు. భారత ప్రభుత్వం తనకు అందజేసిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గూంగా పహిల్వాన్గా పరిచితుడైన వీరేందర్ డెఫ్లిం పిక్స్ (బధిరుల ఒలింపిక్స్)లో భారత్కు మూడు బంగారు పతకాలు సాధించారు. ‘నేను కూడా నా సోదరి, ఈ దేశ ఆడబిడ్డ కోసం నా పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తా. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారూ.. మీ కూతురు, నా చెల్లెలు అయిన సాక్షి మాలిక్ను చూసి నేను గర్విస్తున్నాను. ఈ దేశంలో దిగ్గజ ఆటగాళ్లు కూడా దీనిపై స్పందించాలి..’ అని ట్వీట్ చేశాడు. తన ట్వీట్ను సచిన్ టెండూల్కర్, నీరజ్ చోప్రాలకు ట్యాగ్ చేశారు. వీరేందర్ సింగ్ను భారతప్రభుత్వం 2015లో అర్జున, 2021లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.