కర’కట్టు’ కథలేనా?

Mar 13,2024 09:20 #Nagavali River, #Vamsadhara

2019లో ఉన్నపళంగా పనులను రద్దు చేసిన ప్రభుత్వం
ప్రమాదకర ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణానికి నిర్ణయం
ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : కరకట్టల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఉదాసీనత నదీతీర గ్రామాల ప్రజలను కష్టాలు పాల్జేస్తోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో కరకట్టల పనులను రద్దు చేసింది. వాటి స్థానంలో అత్యంత ప్రమాదరకరమైన ప్రాంతాల్లో వరద గట్లు నిర్మించాలని నిర్ణయించింది. వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లో తీవ్ర కోతకు గురైన ప్రాంతాలను ప్రభుత్వ సూచనల మేరకు అధికారులు గుర్తించారు. రక్షణ గోడల నిర్మాణానికి అవసరమైన అంచనా వ్యయంతో ప్రభుత్వానికి 2020లోనే ప్రతిపాదనలు పంపారు. నాలుగేళ్లు అవుతున్నా నేటికీ ఆమోదం తెలపలేదు. పనులకు సంబంధించిన ఫైల్‌కు ఏదో ఒక కొర్రీ వేసి వెనక్కి పంపుతోంది. దీంతో, వంశధార, నాగావళి కరకట్టల కొత్త పనులకు ఒక్క అడుగూ పడడం లేదు.
వంశధార, నాగావళి నదుల వరదల నుంచి నదీ తీర గ్రామాల రక్షణకు గతంలో కరకట్టల పనులను ప్రారంభించినా ఫలితం లేకపోయింది. 2009-10 మధ్య కాలం వరకు కాస్తాకూస్తో పనులు జరిగినా ఆ తర్వాత నుంచి ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. కరకట్టల నిర్మాణానికి పెద్ద ఎత్తున భూమిని సేకరించాల్సి ఉండడం, భూసేకరణకు అధికంగా నిధులు వెచ్చించాల్సి రావడంతో ప్రభుత్వం 2019లో ఉన్నపళంగా కరకట్టలను రద్దు చేసింది. వరద ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలంటూ అధికారులను ఆదేశించింది. జిల్లాలో ఆ విధంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు 2020 ఫిబ్రవరిలోనే ప్రతిపాదనలు పంపారు.
ముంపు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అందులో ముఖ్యమైన పనులకు ప్రాధాన్యమివ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో నాగావళి కరకట్టలకు సంబంధించి అధికారులు తొలుత ఐదు ప్రాంతాలను గుర్తించారు. నాగావళి నది పరివాహక ప్రాంతమైన ఆమదాలవలస మండలం తొగరం వద్ద రూ.13.14 కోట్లతో, పొందూరు గండ్రేడు వద్ద రూ.8.82 కోట్లు, ఆమదాలవలస బెలమాం వద్ద రూ.1.83 కోట్లు, బూర్జ మండలం అల్లెన నుంచి బూర్జ పాత కరకట్ట వరకు వరద గట్టు కోసం రూ.13.86 కోట్లతో మొత్తం రూ.37.65 కోట్లతో, వంశధార నదీ పరివాహక ప్రాంతంలో 22.77 కిలోమీటర్ల మేర కరకట్టలను నిర్మించేందుకు రూ.77.60 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మూడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ ఆమోదం తెలపలేదు.

కరకట్టల పనుల పరిస్థితి ఇలా…
వంశధార నదిపై నిర్మించాల్సిన కరకట్టలను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీ పనులు 2007లో ప్రారంభించారు. ఇప్పటివరకు 7.55 శాతం పనులే పూర్తయ్యాయి. 2007లోనే మొదలైన ప్యాకేజీ-2 పనులు 5.66 శాతం మాత్రమే జరిగాయి. ప్యాకేజీ-3 పనులను కూడా 2007లో ప్రారంభించారు. 2.45 శాతం పనులు పూర్తి చేశారు. 2009లో ప్రారంభమైన ప్యాకేజీ-4 పనులు 21.32 శాతం మాత్రమే జరిగాయి. నాగావళి నదిపై నిర్మిస్తున్న కరకట్టల పరిస్థితి కూడా అలానే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న కరకట్టలను నాగావళి-2 ప్యాకేజీ పనులుగా చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్సు సంస్థకు రూ. 61.45 కోట్లకు పనులను అప్పగించారు. ఆ సంస్థ 2008లో పనులు ప్రారంభించింది. ఇప్పటికి కూడా పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. జిల్లా పరిధిలో 51.88 కిలోమీటర్ల పొడవున వరద కట్ట నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 17.29 కిలోమీటర్ల మేర మాత్రమే పని పూర్తయింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 శాతం కంటే తక్కువ ఖర్చు చేసిన పనులను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ 2019 మే 29న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, అధికారులు ఎక్కడి పనులను అక్కడే నిలిపేశారు

ఎన్నాళ్లీ ముంపు బాధలు ?
వర్షాకాలం వస్తే నదీ తీర గ్రామాలకు ఏటా ముంపు బాధలు తప్పడం లేదు. అల్పపీడన ప్రభావంతో గతేడాది ఆగస్టులో ఒడిశాలో కురిసిన వర్షాలకు వంశధారకు ఆకస్మిక వరద వచ్చింది. హిరమండలం మండలం గొట్టాబ్యారేజి వద్ద గరిష్టంగా 77 వేల క్యూసెక్కులు నమోదైంది. వరద ఉధృతితో కొత్తూరు మండలం పెనుగోటివాడ, మాతల, నివగాం, సోమరాజపురం, ఆకులతంపరలో పొలాలు ముంపునకు గురయ్యాయి. సుమారు 500 ఎకరాల్లో వరి, అరటి, చెరుకు పంటలు దెబ్బతిన్నాయి. తుపాన్లు, వర్షాల సమయంలో వరద హెచ్చరికలు జారీ చేసి హడావుడి చేస్తున్న ప్రభుత్వం… ఆ తర్వాత రక్షణ చర్యలు విస్మరిస్తోంది. దీంతో, వర్షాకాలంలో నదీ తీర గ్రామాల ప్రజలు ముంపు బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నదీ తీర గ్రామాల వెంబడి కరకట్టలను నిర్మించాలని కోరుతున్నారు.

➡️