15న విచారించేందుకు సిజెఐ నిర్ణయం
సెలక్షన్ కమిటీ సమావేశంపై అధిర్ రంజన్ చౌదరి లేఖ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ఎన్నికల అధికారి (సిఇసి), ఇసి నియామకాల అంశం మరోసారి వివాదానికి దారితీసింది. నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల అత్యవసర విచారణ చేపట్టాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) తాజాగా అభ్యర్థించింది. ఇందుకు అంగీకరించిన కోర్టు ఈ నెల 15న విచారణ జరుపుతామని వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘం లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెల ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఈ క్రమంలోనే ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ మార్చి 15లోగా కొత్త కమిషనర్ల పేర్లను ఖరారు చేయనున్నారు. తాజా నియామకాలను సవాల్ చేస్తూ ఇటీవల కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని కూడా శుక్రవారం విచారించనుంది.