ఉప్పల్ : భారీగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించని కారణంగా… ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో చెన్నై, హైదరాబాద్ జట్లు ఉండగానే విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. విద్యుత్తు బకాయి రూ.1.63 కోట్లు చెల్లించకుండానే ఐపిఎల్ మ్యాచ్లకు విద్యుత్తు వాడకంతో ఆ శాఖ అధికారులు కరెంటు సరఫరాను ఆపేశారు. నోటీసులిచ్చినా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) స్పందించలేదు. కొద్దిసేపటికి మళ్లీ కరెంటును పునరుద్ధరించారు.
హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు మాట్లాడుతూ … ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ యధావిధిగా సాగుతుందని తెలిపారు. స్టేడియానికి కరెంట్ తిప్పలు తాత్కాలికంగా తప్పాయని అన్నారు. క్రికెట్ అభిమానులు నిరుత్సాహం చెందవద్దన్న కారణంతో.. బకాయిల చెల్లింపులకు ఒక రోజు అదనపు సమయం ఇచ్చినట్లు విద్యుత్శాఖ పేర్కొంది. దాంతో నేటి రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఎలాంటి అంతరాయాలు లేకుండా జరగనుంది. ఉప్పల్ స్డేడియంలో శుక్రవారం జరుగనున్న ఐపిఎల్ మ్యాచ్కు టీఎస్ఆర్టీసీ 24 డిపోల నుంచి 60 బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకూ ఉంటాయి.