ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్ స్టీల్ప్లాంట్పైనా, కార్మికులపైనా జరుగుతున్న కుట్రలను అడ్డుకోవడానికి ఐక్య పోరాటాలే శరణ్యమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1156వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ ఇన్స్ట్రుమెంటేషన్, క్యుఎటిడి, ఆర్అండ్డి, కన్స్ట్రక్షన్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అన్ని వైపుల నుంచీ విశాఖ ఉక్కుపై దాడిని మొదలుపెట్టిందని, దీన్ని అడ్డుకుని పోరాటాలు చేయడానికి కార్మికులు సిద్ధం కావాల్సి ఉందన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మూడేళ్లుగా పోరాటాలు నిర్వహిస్తున్నామని, ఫలితంగానే ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రం ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయిందని తెలిపారు. ప్లాంట్ ప్రయివేటీకరణపై మోడీ సర్కారు వెనక్కు తగ్గేవరకూ పోరాటం కొనసాగుతుందన్నారు.