ఢిల్లీ : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఇండియా టుడే’ నిర్వహించిన కాన్క్లేవ్లో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై తొలిసారి స్పందించారు. గతంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన కంపెనీల నుండే బిజెపికి ఎలక్టోరల్ బాండ్లు అందాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ప్రచారం ఉహగానమని నిర్మలా సీతారామన్ కొట్టి పారేశారు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈడీ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా అంటూ వెల్లడించారు. పూర్తి వివరాలు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించించడం గురించి ప్రస్తావించగా.. ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందంటూ దాటవేశారు. ఎలక్టోరల్ బాండ్లలో అత్యధిక భాగం బిజెపికే వెళ్లాయని ఇటీవల గణాంకాలు విడుదల అయ్యాయి. క్విడ్ ప్రోకో, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు వంటి విధానాలు అమలు చేసి అనేక కంపెనీల నుండి ఎలక్టోరల్ బాండ్లను బిజెపి పొందిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.