ముంబయి : నిరంకుశత్వం దేశానికి హానికరమని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావాలని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్దవ్ థాకరే పేర్కొన్నారు. దేశంలో ‘ఇండియా కూటమి’ సంకీర్ణ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ప్రజలకు సూచించారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు బలంగా పనిచేశాయని, బలమైన నేత తనతో పాటు అందరినీ ముందుకు తీసుకువెళతారని అన్నారు.
జల్గావ్ జిల్లా నుండి బిజెపి, బిఆర్ఎస్, వంచిత్ బహుజన్ అఘాడీ (విబిఎ)ల నుండి పలువురు కార్యకర్తలు శివసేనలో చేరారు. ఈ సందర్భంగా ముంబయిలోని ఆయన నివాసం మాతోశ్రీ నుండి మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో మొదటిసారి దేశంలో పెద్ద ఎత్తున అసంతృప్తి కనిపించిందని అన్నారు. నిరంకుశత్వం దేశానికి హానికరమని, సంకీర్ణ ప్రభుత్వం ఉండకూడదన్న భావన గతలో ఉండేదని కానీ పి.వి. నరసింహారావు, వాజ్పేయి, మన్మోహన్ సింగ్ల హయాంలోని సంకీర్ణ ప్రభుత్వాలు బాగా పనిచేశాయని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో బలమైన దేశం కావాలని అన్నారు.