న్యూఢిల్లీ: ఇండియన్ సివిల్ సర్వీసుల్లో 1,056 పోర్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నుంచి వచ్చే నెల మార్చి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న జరుగనున్నది. దాంతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 150 పోస్టు భర్తీకి సైతం ప్రత్యేకంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21-32 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు సైతం ఉంటుంది. ఓబీసీ, ఇతర అభ్యర్థులు ఫీజు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సి, ఎస్టి, వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.