‘ఉక్కు’ ధూం ధాం పోస్టర్‌ ఆవిష్కరణ

Dec 17,2023 09:10 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు గాజువాకలో తలపెట్టిన ఉక్కు ధూంధాం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సినీరంగ ప్రముఖులు సత్యానంద్‌ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యానంద్‌ మాట్లాడుతూ కళాకారులు, నటులు, రచయితలు అందరూ ఒకే వేదికపై ఇలా గళమెత్తడం అభినందనీయమన్నారు. జానపద కళారూపాలు, డప్పులు, కోలాటాలు, తప్పెట గుళ్లు, విచిత్ర వేషాలు, ఏకపాత్రాభినయాలు, డ్యాన్సులతో సాగే ఈ ధూంధాంను జయప్రదం చేయాలని కోరారు. ఉక్కు పరిరక్షణ పోరాటంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.చంటి, సీనియర్‌ నాయకులు వై.అప్పారావు పాల్గన్నారు. ధూంధాం పూర్తి వివరాల కోసం 9100550706 నెంబర్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

➡️