ఎస్‌ఎస్‌ ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Nov 20,2023 21:49 #Children, #death

ప్రజాశక్తి – ఆదోని రూరల్‌ : సమ్మర్‌ స్టోరేజ్‌ (ఎస్‌ఎస్‌) ట్యాంకులో నీరు తాగేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దహరివాణం గ్రామానికి చెందిన తుకారాం, పార్వతి దంపతుల కుమారుడు మంజునాథ (11) ఐదవ తరగతి, అబ్బాస్‌, ఆషాల దంపతుల కుమారుడు అలీ అక్బర్‌ (10) నాల్గవ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యాభాసం చేస్తున్నారు. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన అనంతరం నీళ్లు తాగేందుకని స్కూలు నుంచి ఇద్దరూ బయటకు వచ్చారు. గ్రామ సమీపంలోని ఎస్‌ఎస్‌ ట్యాంకులో నీళ్లు తాగేందుకు వెళ్లి కాలు జారి అందులో పడిపోయారు. స్థానికులు గమనించి ట్యాంకులోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు చిన్నారులను ఒడ్డుకు చేర్చి, ఆదోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

➡️