ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదం – ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి

ఉంగుటూరు (కృష్ణా జిల్లా) : ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రాయల్‌ బ్రిస్బేన్‌ ఉమెన్స్‌ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. తనకు ఇష్టమైన విభాగంలో పీజీ చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉజ్వల లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈనెల 2వ తేదీన సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మృతి చెందారు. ఈ దుర్ఘటన ఆమె కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఉజ్వల తల్లిదండ్రులైన వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. శనివారం అంత్యక్రియల కోసం ఆమె భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్య (మూల్పూరు రమేష్‌)ల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

➡️