హైదరాబాద్ : గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్కి చెందిన పలువురి ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీతోపాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు అబ్బాస్ ఇచ్చిన స్టేట్మెంట్లో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ పేరు ఉన్నట్లు తేలింది.
డ్రగ్స్కు సంబంధించి పోలీసులు నిర్వహించిన దాడుల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద్ నిర్వహించిన పార్టీలో క్రిష్, కేదార్, నిర్భరు, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో వివేకానంద్, కేదార్, నిర్భరులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు అందరూ పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి క్రిష్ స్పందించలేదు. ఆయన నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.