ప్రజాశక్తి-అమలాపురం అల్లవరం మండలం గూడాలలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు తాటాకిళ్లు దగ్ధం అవగా, పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ పాక్షికంగా దెబ్బతింది. ఆకుల మంగతాయారుకు చెందిన ఇంటి పైకప్పు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కింట్లో నిద్రిస్తున్న దొడ్డా వెంకటేశ్వరరావు కుమార్తె రేవతి మంటలను గమనించి ఒక్కసారిగా కేకలు వేసి అందరినీ నిద్ర లేపడంతో మూడు కుటుంబాలకు చెందిన పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో ఇళ్లల్లో ఉన్న ఐదు గ్యాస్ సిలిండర్లు పేలుపోయాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.బాధితులకు మంత్రి విశ్వరూప్ పరామర్శఅగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన వారి కుటుంబాలను మంత్రి పినిపే విశ్వరూప్ ఆదివారం పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట వైసిపి నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎంపిపి ఇళ్ల శేషగిరిరావు, జెడ్పిటిసి గౌతమ మహేష్, బాపూజీ, యల్లమెల్లి సుభాష్ చంద్రబోస్, నాతి శ్రీనివాస్, రుద్రరాజు నాని రాజు ఉన్నారు.