రతన్‌ టాటాకు బెదిరింపు ఫోన్‌ కాల్‌..! తీరా దర్యాప్తు చేస్తే …!

ముంబయి : ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు ప్రాణానికి ముప్పు ఉందంటూ … గుర్తు తెలియని వ్యక్తి నుండి పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ కాల్‌ బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ వార్త ఆలస్యంగా వెలుగుచూసింది.

ఏం జరిగిందంటే …

ముంబయి పోలీసు కంట్రోల్‌ రూంకు గుర్తుతెలియని వ్యక్తి నుండి ఫోన్‌ కాల్‌ వచ్చింది. రతన్‌ టాటాకు భద్రతను పెంచాలని.. లేదంటే ఆయనకు కూడా సైరస్‌ మిస్త్రీలాగే అవుతుందని బెదిరించాడు. సైరస్‌ మిస్త్రీ టాటా సన్స్‌ కు మాజీ చైర్మెన్‌ గా బాధ్యతలు నిర్వహించారు. సైరస్‌ మిస్త్రీ గత ఏడాది అహ్మదాబాద్‌ నుంచి ముంబాయికు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఇప్పుడు ఈ బెదిరింపు ఫోన్‌ కాల్‌ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. రతన్‌ టాటాకు భద్రతను కట్టుదిట్టం చేశారు. టాటా ఇంటి సమీపంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఫోన్‌ కాల్‌ చేసిన వ్యక్తి గురించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పుణెకు చెందిన వ్యక్తి అని టెక్నికల్‌ సపోర్ట్‌ బఅందం ద్వారా తెలుసుకొని ఆధారాలను సేకరించారు. ఆ వ్యక్తి కర్నాటకలో ఉన్నట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. అయితే బెదిరింపు కాల్‌ చేసిన నిందితుడు ఇంజినీరింగ్‌ చదివి ఎంబిఎ పూర్తి చేశాడని, అతడు సిజోఫ్రేనియా అనే మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పుణెలో అతని ఇంటికి వెళ్లిన పోలీసులు.. అతను 5 రోజుల నుంచి మిస్సింగ్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. బోసారి పోలీసు స్టేషన్‌లో నిందితుడిపై కేసు ఫైల్‌ చేశారు. అతడు ఇంట్లో నుండి మిస్సింగ్‌ అయ్యేటప్పుడు ఇంట్లో ఉన్న వేరొకరి ఫోన్‌ను తనతోకూడా తీసుకెళ్లిపోయాడు. ఆ ఫోన్‌ నుండి ముంబయి పోలీసులకు బెదిరింపు కాల్‌ చేసినట్లు గుర్తించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

➡️