త్రిసూర్ : భారత రాజకీయాల్లో అత్యుత్తమ నటుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్లో ‘ఆర్ట్ అండ్ డెమోక్రసీ’ అనే అంశంపై సోమవారం జరిగిన డిబేట్లో ఆయన మాట్లాడారు. ‘మోడీని మించిన నటుడు భారతదేశంలో లేడు. కాబట్టి నటీనటులకు రాజకీయాల్లో అవకాశం లేదు’ అని అన్నారు. ‘నటన కాదు, ప్రతి ఒక్కరూ తీసుకునే వైఖరి ముఖ్యం’ అని తెలిపారు. ‘మనం మన శత్రువులను గుర్తించాలి. మన భయమే వారి బలమని గ్రహించాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ఈ కాలంలో ఇలాంటి విమర్శలు తప్పవు. నేను దేవుడిని నమ్మేవాడిని కాదు. నా తల్లి క్రిస్టియన్, నా భార్య హిందూ. ఎవరికి ఇష్టమైన దేవుళ్లను వారు ప్రార్థనలు చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకు ముందు ప్రధాని 11 రోజుల పాటు దేశం నుంచి గైర్హాజరయ్యారు’ అని అన్నారు.