ప్రజాశక్తి-గుడివాడ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్టుగా కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యి మంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని.. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారన్నారు.