నంది అవార్డుగ్రహీత మహమ్మద్ మియా
ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ నాటకరంగం భావితరాలకు వారసత్వ సంపద కావాలని, నాటకరంగానికి పునరుజ్జీవనం కలిగించాల్సింది ప్రభుత్వాలేనని నంది అవార్డుగ్రహీత మహమ్మద్మియా అన్నారు. కర్నూలు లలితకళాసమితిలో బుధవారం రాత్రి ప్రపంచనాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాశక్తితో మాట్లాడారు. ఆధునిక సమాజం ఆవిర్భవించినప్పటికీ నాటకాలకు ఆదరణ తగ్గలేదని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ నాటకాలు ఉత్సవాలకు, జాతర్లలలో వేస్తున్నారన్నారు. షార్ట్ ఫిల్మ్లు రాజ్యమేలుతున్న ప్రస్తుతకాలంలోనూ నాటకాలకు యువతీయువకులు ఆకర్షితులౌతున్నారన్నారు. వయసు పైబడిన నాటకరంగ కళాకారులందరికీ ప్రభుత్వం పెన్షన్తో సరిపెట్టకుండా ఆరోగ్యకార్డులు మంజూరు చేయాలని, ఇళ్లులేని కళాకారులకు స్థలమూ, సొంత ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. నాటకమంటే పౌరాణిక, సాంఘీక, ఇతిహాస కథల సమాహారమని అందులోని ఆధ్యాత్మికకోణాల్లోని సామాజికస్పృహ, నైతికత దాగివుంటుందన్నారు. ఇప్పటివరకు తనజీవితంలో మూడుదశాబ్దాల నాటకప్రయాణమని ప్రేక్షకుల ఆదరాభిమానాలే కారణమన్నారు.