అమరావతి : ” భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుంది ” అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ఆదివారం భోగి పండుగను పురస్కరించుకొని అమరావతి రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ …. తెలుగుజాతి పెద్దఎత్తున నిర్వహించుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుందని చెప్పారు. ఒకవైపు బాధ ఉంది.. మరోవైపు కోపం ఉందన్నారు. ఈ ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రాజధాని రైతులు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు అని ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైంది అని హెచ్చరించారు.