ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :స్కిల్ డెవలప్మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయాలని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. మూడు వారాల తరువాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ.. కౌంటర్ దాఖలుకు గతంలో సమయం తీసుకుని ఇప్పుడు మళ్లీ వాయిదా కోరుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు తరపున కౌంటర్ దాఖలు చేశారని చెప్పారు. విచారణకు తేదీని నిర్ణయించాలని కోరారు. తొలుత రెండు వారాల తరువాత లిస్ట్ చేయాలని ఆదేశించిన ధర్మాసనం, రంజిత్ కుమార్ విజ్ఞప్తితో ఈ నెల 26కు వాయిదా వేసింది.