టెక్సాస్ (అమెరికా) : అగ్రరాజ్యంలోని టెక్సాస్లో మళ్లీ కాల్పులు జరిగాయి. టెక్సాస్లోని హూస్టన్లో ఉన్న జోయెల్ ఓస్టీన్ మెగా చర్చిలో ఓ మహిళ కాల్పులు జరిపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడితో సహా మరో వ్యక్తి గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో … ఐదేళ్ల బాలుడితో కలిసి ఓ మహిళ చర్చిలో ప్రవేశించింది. తాను ధరించిన కోటు చాటున పొడవాటి తుపాకీని తీసుకొచ్చింది. అందరూ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించింది. దీంతో అక్కడివారు భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. భద్రతను పర్యవేక్షిస్తున్న ఇద్దరు పోలీసులు వెంటనే ఎదురు కాల్పులు జరపటంతో ఆమె మృతిచెందింది. ఆమెతో వచ్చిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన మహిళను గుర్తించే పనిలో ఉన్నట్లు హూస్టన్ పోలీస్ చీఫ్ ట్రారు ఫిన్నర్ తెలిపారు. ఆమె ఎందుకు కాల్పులు జరిపిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు. హార్ట్ఫోర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిలిజియన్ రీసెర్చ్ ప్రకారం… ప్రతి వారం 45 వేలమంది ఈ మెగా చర్చ్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఈ చర్చి యుఎస్ లో మూడవ అతిపెద్ద మెగాచర్చ్గా నిలిచింది. ఈ చర్చి పాస్టర్ ఒస్టీన్ టెలివిజన్ ప్రసంగాలు దాదాపు 100 దేశాలకు చేరుకుంటాయి.