పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి : 10 మంది పోలీసులు మృతి

ఇస్లామాబాద్‌ (పాకిస్థాన్‌) : పాకిస్థాన్‌లో డేరా ఇస్మాయిల్‌ఖాన్‌లోని చోడ్వాన్‌ పోలీస్‌ స్టేషన్‌పై ఉగ్రమూకలు సోమవారం దాడిచేశాయి. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్‌ పోలీసు అధికారులు మాట్లాడుతూ … ఉదయం 3 గంటలకు, ఉగ్రవాదులు పోలీసు స్టేషన్‌పై దాడి చేశారని తెలిపారు. పోలీసు భవనంలోకి ప్రవేశించి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని చెప్పారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లో గత కొద్ది రోజులుగా ఉగ్రదాడుల ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్థాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.

➡️