తెలుగు రాష్ట్రాలు, భిన్న రాజకీయ శిబిరాలు

Telugu states, different political camps

తెలుగు రాష్ట్రాల్లో ఉనికిలోనే లేని బిజెపిపై పోరాటం ఏమిటి? దాన్ని ఎందుకు విమర్శించాలంటూ మాట్లాడటం ఎంత అనాలోచితమో ఈ వారం అందరికీ తెలిసి వచ్చింది. ప్రధాని మోడీ విజన్‌ను తాను ఎప్పుడూ బలపరుస్తూనే వున్నానని సంజాయిషీ చెప్పుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌తో సహా వెళ్లి వెంటబడి మరీ పొత్తు ఖరారు తతంగం పూర్తి చేశారు. సింహం సింగిల్‌గా వస్తుంది గనక నాకు పొత్తులతో పని లేదని గొప్పగా చెప్పుకునే ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ బిజెపిని, మోడీని ప్రస్తావించకుండానే ఇద్దరు రాష్ట్ర నేతలను వారి పార్టీలపై మాత్రం రెచ్చిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తొలుత పేర్కొన్నట్టు బిజెపిపై విమర్శ ఎందుకని ప్రశ్నించి ఆ పైన సర్దుకునేందుకు ఉగ్రరూపంతో చెలరేగిపోతున్నారు. కనిపించని కాషాయ పార్టీ ప్రభావం ఎంతో ఎందుకో ఈ తాజా పరిణామాలే చెబుతున్నాయి. దక్షిణాదిన కర్ణాటక తప్ప మరెక్కడా ఠికానా లేని బిజెపి నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఎ.పి లో పార్టీలు మూడింటినీ తన చుట్టూ తిప్పుకోవడం విచిత్రంగా కనిపించే వాస్తవం. ఘర్‌వాపసీ పేరుతో మళ్లీ ఎన్‌డిఎ ప్రాంగణంలో ప్రవేశించి బిజెపి పంచన చేరడానికి టిడిపి, జనసేన పాకులాడటం దివాళాకోరు రాజకీయాలకు తాజా నిదర్శనం.

జగన్‌, బాబు, పవన్‌ ప్రదక్షిణలు

ఏదిఏమైనా బిజెపితో కలసి వెళ్లాలని చంద్రబాబు నాయుడు ఆరాటపడటం, ఆఖరి వరకూ తలుపు తీసి వుంటానని ప్రకటించడం రాజకీయ వర్గాలలో తెలిసిన విషయమే. ఓట్ల చీలిక నివారించడం, అరెస్టు తర్వాత కేసుల వేట నుంచి రక్షించుకోవడం, ఎన్నికల్లో ప్రచారం, ఎన్నికల నిర్వహణ సజావుగా వుండేట్టు కేంద్రం సహాయం తీసుకోవడం మూడు కారణాలుగా చెప్పుకుంటున్నవే. ఇలా మూడు కారణాలు చెబుతుండగా నాల్గవది ఆయన ‘ఫోర్త్‌ విజన్‌’ అంటున్నారు. ఎన్నికల అనంతర పరిణామాలు ఎలా వున్నా కేంద్రంలో బిజెపి అండదండలుండటం అవసరమని ఆయన భావిస్తున్నారట. ఎందుకంటే 2004, 2009లో వరుసగా ఓడిపోయిన అనుభవం ఆయనకుంది. ఏ కారణం చేతనైనా అలాంటి స్థితి వస్తే టిడిపిని కాపాడుకోవడానికేగాక పదవుల నీడ కాపాడుకోవడానికి కూడా పొత్తు వుండాలని ఆలోచిస్తున్నారట. టిడిపిలో ఒక పెద్ద భాగం బిజెపితో పొత్తు వల్ల మైనార్టీలలో దళితులలో నష్టం జరుగుతుందని సీట్లు తగ్గి పార్టీ నేతలు దూరమవుతారని హెచ్చరించినా సరే, ఆ సంగతి తనకు వదిలేయమని ఆ దిశలోనే అడుగులు వేయడానికి అదే కారణమంటున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ చేగువేరాను పక్కన పెట్టి వినాయక్‌ సావర్కార్‌ను, సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నాక సంఘ పరివార్‌ బిజెపిలో సహజ మిత్రుడుగా స్థానం కాపాడుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రం వరకూ టిడిపితో వెళ్లడం అనివార్యమని నిర్ణయానికొచ్చారు. బిజెపి నాయక త్రయం మోడీ, అమిత్‌ షా, జె.పి నడ్డాలకు ఈ జంటకవులు చక్కగా అక్కరకు వచ్చారు. పిబ్రవరి 7న అమిత్‌ షాతో అర్ధరాత్రి తొలి భేటీ జరిపిన చంద్రబాబు ఈ నెల రోజులు ఆ పార్టీ తన సంగతి అధికారికంగా ప్రకటించకపోయినా మళ్లీ మార్చి 7 అర్థరాత్రి వరకూ సహనంతో వేచి వున్నారు. ఈ లోపల జనసేన, టిడిపి సీట్ల సర్దుబాటు ప్రకటించి, ప్రత్యేక హోదా, కేంద్ర నిధుల విడుదల వంటి అంశాలే ప్రస్తావించకుండా, సభలూ సందడులు సాగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు అమిత్‌షా నడ్డాలతో ఇప్పుడు చర్చల ప్రక్రియలో ప్రవేశించారు. దక్షిణాదిన బిజెపికి తొలిసారి కాలూనడానికి చోటిచ్చిన చంద్రబాబు ఈ ఎన్నికల సమయంలో మరోసారి దాని వ్యూహాలకు ఊతంగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో ముందుగా సమాధి అవబోతున్నది ప్రత్యేక హోదా, దాంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలు. తర్వాత సవాలు లౌకికతత్వానికి. బిజెపిని పిలిచి నెత్తిన పెట్టుకోవడమంటే ఎ.పి లో మతతత్వ రాజకీయాలకు పిలిచి పీట వేయడమే. గత ఎన్నికల్లో ‘నోటా’ కన్నా తక్కువగా ఒక్క శాతం కూడా ఓట్లు రాని బిజెపిని, మోడీని మోసేందుకు టిడిపి, జనసేన సిద్ధమైపోయాయి. ఇక వైసిపి నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా మొదటి నుంచి దాన్ని మోస్తూనే వుంది. ఈ అయిదేళ్ల పాలనలోనూ ఒక్కసారి కూడా బిజెపిని ప్రశ్నించిన పాపాన పోలేదు. ఈ విధంగా పాలక ప్రతిపక్ష పార్టీలూ పోటీ పడి మోడీని మోయడం ఒక్క ఏపి లోనే చూస్తాం. అధికార ప్రయోజనాలు, కార్పొరేట్‌ బంధాలు తప్ప ఇందుకు మరో కారణం కనిపించదు. ఈ మత రాజకీయాలకు తోడు పవన్‌ కళ్యాణ్‌కూ కాపు పెద్దలకూ మధ్య నడిచిన రాజకీయ రభసలు మరోసారి కులం కుంపటిని రాజేసే అవకాశముంది. వైసిపి, టిడిపి కూడా అనేక రూపాలలో కుల సమీకరణలను పెంచుతున్నాయి. కేవలం ఎన్నికల అవసరాల కోసం దీర్ఘకాలిక ప్రశాంతతను భగం చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం.

వామపక్షాల పంథా, ఇతర పార్టీలు
దీనికి తోడు అవకాశవాదంతో టికెట్ల కోసం చూసి రాకపోతే అవతలి పార్టీలోకి దూకడం, అప్పటిదాకా తిట్టిపోసిన వారినే అక్కున చేర్చుకోవడం విచ్చలవిడిగా సాగుతున్నది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి అమరావతి పూర్తికి హామీ ఇచ్చే బదులు విశాఖ రాజధాని పేరిట మళ్లీ మూడు రాజధానుల వివాదాన్ని పైకి లేపడం ప్రాంతీయ పరమైన రాజకీయాలను పురికొల్పే ప్రయత్నమే. జగన్‌ సర్కారు తప్పులు, ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటం సరైందే అయినా ఆ పేరిట బిజెపితో జట్టు కట్టడం ఏ విధంగానూ సరైంది కాదని ఆలోచనాపరులు అర్థంచేసుకోవలసి వుంటుంది. కాని టిడిపి, వైసిపి అనుకూల మీడియా కథనాలలో తమ తగాదాలు తప్ప మతతత్వం, సమాఖ్యతత్వం వంటి అంశాల ఊసే చూడం.
ఈ సమయంలో వామపక్షాలు రాష్ట్ర ప్రయోజనాలు, దేశంలో లౌకిక ప్రజాస్వామ్య విలువల కోసం గట్టిగా నిలబడి కలిసి వచ్చేవారిని సమీకరించడం ఒకింత ఉపశమనం కలిగించే అంశం. సిపిఎం సిపిఐ లతో పాటు కాంగ్రెస్‌, ఆప్‌, జైభారత్‌, ప్రత్యేక హోదా పరిరక్షణ సమితి వంటివి ఈ కార్యక్రమాలలో కలసి వచ్చాయి. ఆ విధంగా ఒక సమాంతర ప్రజాస్వామిక స్వరం వినిపించే అవకాశం కాపాడబడింది. వై.ఎస్‌ షర్మిల వచ్చాక ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులతో సహా పర్యటనకు రావడం, తిరుపతి, అనంతపురం వంటి చోట్ల సభలు జరపడం కొంత కదలికకు దోహదపడింది. కాంగ్రెస్‌ విధానం ఇంకా సమగ్రంగా తెలియవలసి వుంటుంది.

రేవంత్‌ వ్యాఖ్యల దుమారం
తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా త్వరలోనే ఎ.పి లో పర్యటించి ప్రచారం చేస్తారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కోసం కలసి పని చేయాలని ఆయన ఈ మధ్యనే ఆకాంక్షించారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోయిందని ఆయన ఆవేదన వెలిబుచ్చుతూ చంద్రబాబును వదిలేసి వెంకయ్య నాయుడు పేరును ప్రస్తావించడం ఆసక్తి కలిగించింది. ఇప్పుడు స్వయంగా ఆయనే ఎ.పి పర్యటనకు రానుండడంతో ఏం చెబుతారో చూడవలసి వుంటుంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాటలు దుమారం రేపాయి. మోడీని బడా భారు (పెద్దన్న) అంటూ అభివర్ణించిన రేవంత్‌…కెసిఆర్‌ హయాంలో కేంద్రంతో సంబంధాలు దెబ్బ తింటే తాను దారిలో పెడుతున్నానన్న సంకేతం ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర సత్సంబంధాలు వుండాలనడం బాగానే వున్నా అందుకు ప్రధాన ఆటంకం కేంద్రం ఏకపక్ష పోకడలేనన్న ప్రాథమిక వాస్తవం విస్మరించారు. గుజరాత్‌లా తెలంగాణ అబివృద్ధి కావడానికి మోడీ సహకారం అభ్యర్థించారు. ఎన్నికలకు నెల రోజుల ముందు జరుగుతున్న సభలో మోడీని ఇలా అభ్యర్థించడమంటే రాబోయేది ఆయన ప్రభుత్వమేనని సంకేతాలిచ్చినట్టయిందని మీడియాలో వ్యాఖ్యానాలు వచ్చాయి. గుజరాత్‌లా అభివృద్ధి అని ఆ రాష్ట్రాన్ని నమూనాగా చూపడం కూడా దేశంలో వున్న విమర్శల నేపథ్యంలో చెల్లుబాటయ్యేది కాదు. అంతేగాక ఇన్ని ప్రశంసల తర్వాత కూడా మోడీ తన పర్యటనలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను తీవ్రంగా విమర్శించి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్‌కు తాజా ఎటిఎం అన్నారు. విమర్శలు వచ్చాక రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తాను సమాఖ్య స్ఫూర్త్తితో ప్రధానిని గౌరవించినట్టు సమర్థించుకున్నారు. గుజరాత్‌కు ఇచ్చినట్టే తమకూ ఇవ్వాలని తమ ఉద్దేశమని కొత్త అర్థం చెప్పారు. ఎవరో పక్కదోవ పట్టించడం వల్లనే మోడీ ఎటిఎం అన్నారని సర్దుబాటు చేశారు. నిజంగా మోడీని పక్కదోవ పట్టించేదెవరు? ప్రతిపక్ష ప్రభుత్వాలపై దాడి చేయడం, అవినీతి పేరుతో ఇ.డి, సిబిఐ లను పురికొల్పడం మోడీ సర్కారుకు రివాజుగా మారిందని తెలిసీ ముఖ్యమంత్రి ఇలా వెనకేసుకు రావడం ఆశ్చర్యం కలిగించింది. కాంగ్రెస్‌ పెద్దలలోనూ తన మాటలపై అసంతృప్తి వ్యక్తం కాగా బిజెపికి అనుకూలమైన కొన్ని మీడియాల్లో మద్దతు లభించింది. ఇదే సమయంలో బిఆర్‌ఎస్‌ నేతలు కెసిఆర్‌, కెటిఆర్‌ ఈ ప్రభుత్వం నాలుగు నెలల్లో కూలిపోతుందని బెదిరించడం ఆయన కోపానికి కారణమైంది. వీటన్నిటికి సమాధానంగా రెచ్చిపోయిన రేవంత్‌ రెడ్డి స్వంత జిల్లా పాలమూరు సభలో ఉగ్రరూపం దాల్చారు. తన ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే మెడపై కాలు పెట్టి తొక్కుతానని, పేగులు మెడలో వేసుకుంటామనీ తమ వాళ్లు మానవ బాంబులవుతారనీ తీవ్ర హెచ్చరికలు చేశారు. రాజకీయ సవరణ కోసం ఆయన చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమైనాయి.

టి బిజెపి ఎత్తుగడలు
మొదటి నుంచి బిఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో ఒక షిండే వున్నాడనీ ఎప్పుడైనా ఆ ప్రభుత్వం కూలిపోతుందని అంటూనే వున్నారు. మోడీపై రేవంత్‌ మెతక వైఖరి దాని ఫలితమేనని ఆరోపించారు. తమాషా ఏమంటే బిజెపి ఎం.పి లక్ష్మణ్‌ కూడా షిండే ఎవరో త్వరలోనే తెలుస్తుందని చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. బిజెపితో కలవడానికి బిఆర్‌ఎస్‌ ప్రయత్నం చేసిందని కథలు నడుస్తూనే వున్నాయి. ఈ మధ్యలోనే బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కెసిఆర్‌ను కలిసి పొత్తు ప్రయత్నాలు ప్రారంభించారు. మాయావతి ఆశీస్సులతోనే ఇది జరిగిందని సమాచారం, మతతత్వంపై పోరాటం కోసం కాంగ్రెస్‌ను ఎదిరిస్తామని వారు చెప్పడం ఈ పొత్తు ఉద్దేశాలపై ప్రశ్నలు రేపింది. కాంగ్రెస్‌, బిజెపి మధ్య సమ దూరం అనడం బిజెపిపై పోరాటం పదును తగ్గించేందుకే దారితీస్తుందన్న అభిప్రాయాలు బలంగా వున్నాయి. బిఆర్‌ఎస్‌ పేరుతో హడావుడి చేసిన కెసిఆర్‌ ఆ ప్రయత్నాలు దాదాపు విరమించుకున్న దశలో తెలంగాణలో ఈ ప్రయత్నం ఎటువైపనేది ప్రశ్న. బిజెపి అభ్యర్థులను ప్రకటించి తామే గెలుస్తామని ప్రకటిస్తుంటే కాంగ్రెస్‌ కూడా నాలుగు పేర్లు విడుదల చేసింది. ఈ విధంగా తెలగు రాష్ట్రాలలో భిన్న శిబిరాలుగా పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. బిజెపి మాత్రం దేశమంతటిలాగే ఇక్కడా తన ఏకపక్ష వ్యూహాలతో చాప కింద నీరులా రాజకీయం నడుపుతుందనేది గమనించాల్సిన వాస్తవం.

telakapalli ravi

  • తెలకపల్లి రవి
➡️