ఎన్‌టిపిసి సింహాద్రిలో అంతరాయం

ప్రజాశక్తి – పరవాడ (అనకాపల్లి) ; అనకాపల్లి జిల్లా పరవాడలోని ఎన్‌టిపిసి సింహాద్రిలో విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 500 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం కలిగిన యూనిట్‌లో పైపులైన్‌ లీకేజీతో అంతరాయం ఏర్పడింది. దీని మరమ్మతులు పూర్తి కావడానికి రెండు రోజులు పడుతుందని, బుధ లేదా గురువారాల్లో పునరుత్పత్తి జరుగుతుందని మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. ఇదిలా ఉండగా 500 మెగావాట్లు విద్యుత్‌ సామర్థ్యం కలిగిన మరో యూనిట్‌ను వారం రోజుల నుంచి మెయింటినెన్స్‌ నిమిత్తం ఆపేశారు. ఈ యూనిట్‌ పునరుద్ధరణకు ఒకటి, రెండు నెలలు పట్టే అవకాశముంది. ఎన్‌టిపిసి సింహాద్రి రెండు వేల మెగావాట్ల విద్యుత్తును ఇప్పటి వరకూ ఉత్పత్తి చేస్తూ రాగా ప్రస్తుతం వెయ్యి మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోందని యాజమాన్యం తెలిపింది.

➡️