తిరుపతిలో జనసేనాని పవన్టిడిపి, జనసేన శ్రేణులతో మంతనాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చేందుకేనన్న చర్చ ప్రజాశక్తి -తిరుపతి సిటీ తిరపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం ఎట్టకేలకు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. అధికార పార్టీ ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆరణి శ్రీనివాసులును తిరపతి జనసేన అభ్యర్థిగా ప్రకటించిన విషయం విదితమే. అప్పటి నుంచి అటు టిడిపి ఇటు జనసేన పార్టీ స్థానిక నాయకుల్లో అసంతప్తి నెలకొంది. ఒక దశలో పార్టీ అధినాయకులపై తీవ్రస్థాయిలో అసంతప్తి నేతలు ధ్వజమెత్తారు. ముఖ్యంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి సుగుణమ్మ మీడియా ముందు తన సంతప్తిని వెళ్లగక్కుతో కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. జనసేన పార్టీలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కిరణ్ రాయల్ మొదట్నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆదేశిస్తే తప్ప తాను ఏమి చేయనని భీక్ష్మించుకుని కూర్చున్నారు. ఓ పక్క ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం, మరోపక్క అసంతప్తి నేతలు పట్టు వీడకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ నే స్వయంగా రంగంలోకి దిగారు. తిరుపతి పంచాయతీని సెట్ చేస్తానని ఆగ మేఘాల మీద విజయవాడ నుంచి తిరుపతిలో వాలారు. పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తారనే విషయం ఆ పార్టీ నేతలకు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి సమాచారం లేదు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ వస్తారన్న విషయం కన్ఫర్మ్ అయింది. అయినా అంత అయోమయమే ఎప్పుడొస్తాడు ఎక్కడకి వస్తారు ఎవరితో మాట్లాడతారు అనేదంతా సస్పెన్స్ గానే పెట్టారు. మొదటగా సాయంత్రం 6:00కి ప్రముఖ సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఇంట్లో సమావేశం నిర్వహించినట్లు పార్టీ నాయకులు సమాచారం అందింది. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అటు నుంచి నేరుగా తిరుచానూరు సమీపంలోని గ్రాండ్ రిడ్జి హౌటల్కు చేరుకున్నారు. రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకు టిడిపి నాయకులతో చర్చలు నిర్వహించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చొరవ, సూచనతో సమావేశానికి హాజరైన 28 మంది టిడిపి సీనియర్ నాయకులు జనసేన పార్టీకి సహకరిస్తామని పవన్ కళ్యాణ్ కు హామీ ఇచ్చారు. రాత్రి 10 గంటలకు జనసేన పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రావడంతో చర్చలకు వెళ్లారు. రాత్రి పది అవుతున్న జాతీయ పార్టీ అయిన తమను కనీసం చర్చలకూ పిలవలేదని పవన్ కళ్యాణ్ పై స్థానిక బిజెపి నాయకులు అసంతప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన బ్రాండెడ్ హౌటల్ నుంచి ఆవేశంతో వెనుతిరిగారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మీడియా బిజెపి నాయకులను ఏమి జరిగిందని ప్రశ్నించడంతో, ఏమీ లేదు భోజనం చేసుకుని వస్తామని చెప్పి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ మాటతో అందరూ గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆరణి విజయానికి కృషి చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. శుక్రవారం అర్ధరాత్రి అవుతున్నా జనసేనానితో చర్చలు కొనసాగాయి. ఏదిఏమైనా కిరణ్రాయల్ కలిసొస్తారా లేదా, సుగుణమ్మ పరిస్థితి ఏంటి? జనసేన తీర్థం పుచ్చుకుంటారని చర్చ నడిచిన పొలకల మల్లికార్జున్ ఏం చేయనున్నారు? అనేది వేచి చూడాల్సిందే.