ప్రజాశక్తి-అనంతపురం : అనుమానాస్పదస్థితిలో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందారు. అనంతపురంలోని నలంద జూనియర్ కళాశాల హాస్టల్లో ఈ శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దిశ డిఎస్పి అంథోనప్ప తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం కలుహోళ్ల గ్రామానికి చెందిన పాటిల్ సుధా (18) అనంతపురంలోని నలందా కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల స్వగ్రామంలో నిర్వహించిన గౌరమ్మ పండుగకు నవంబరు 29న కళాశాల నుంచి విద్యార్థిని ఇంటికి వెళ్లారు. తిరిగి డిసెంబరు ఒకటి మధ్యాహ్నం 2.40 గంటలకు లేడీస్ హాస్టల్కు వచ్చారు. కళాశాలకెళ్లి సాయంత్రం 5.52 గంటలకు తిరిగి హాస్టల్కు చేరుకున్నారు. నాలుగో అంతస్తుపైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకేశారు. తీవ్రగాయాలతో సుధా అక్కడికక్కడే మరణించారు. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం పోలీసులకు తెలిపింది. తమ కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయని విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి వాస్తవాలు వెలికితీస్తామని డిఎస్పి తెలిపారు.