ప్రజాశక్తి-గన్నవరం : తల్లిదండ్రులు మైనర్లకు బైకుల ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ పెద్దిరాజు హెచ్చరించారు. గన్నవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వాసా.పెద్దిరాజు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గురువారం వాహనదారులకు, తల్లిదండ్రులు పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు పట్ల ప్రత్యేక శ్రద్ధపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వేసవి సెలవుల్లో మైనర్లు బైక్ డ్రైవింగ్, అతివేగంతో ప్రమాదాలకు గురవుతారని తెలిపారు. వాహనాలకు డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా మోటార్ సైకిళ్ళు నడిపే పలువురు మైనర్ల నుంచి వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. మైనర్లకు బండి ఇచ్చిన సంరక్షకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో అది మీకు ప్రాణ రక్షణ కలిగిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.