సామాజిక మాధ్యమాలను దూరం పెట్టడం మొదలైంది!

Dec 25,2023 11:23 #Gartner survey, #Social Media
  • అసత్యాలు, విశృంఖలత్వమే కారణం
  • 2025 నాటికి 50 శాతం మంది గుడ్‌బై చెప్పే అవకాశం
  • గార్ట్‌నర్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ :   సామాజిక మాధ్యమాలు జనజీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో తెలిసిందే. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, స్నాప్‌చాట్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలకు జనం ప్రత్యేకించి యువతరం హత్తుకుపోతున్నారు. అయితే, స్వేచ్ఛ అధికంగా ఉండే ఈ సామాజిక మాధ్యమానికి వినియోగదారులు దూరమవడం మొదలైందని తాజాగా ఒక సర్వేలో వెల్లడయైంది. స్వేచ్ఛ పేరిట విశృంఖలత్వం, అసభ్యతతో పాటు ఎన్నికలను, ప్రజాభిప్రాయాలను ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలు, అసత్యాలు హద్దే లేకుండా వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాను వదిలించుకోవడం మొదలైందని ఆ సర్వేలో తేలింది.

తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం, విషపూరితమైన వినియోగదారు స్థావరాలు, బాట్‌ల ప్రాబల్యం కారణంగా 50 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు 2025 నాటికి సోషల్‌ మీడియాతో తమ పరస్పర చర్యలను పూర్తిగా వదులుకోవటం లేదా గణనీయంగా తగ్గించుకొని కొన్నింటికే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గార్ట్‌నర్‌ తన సర్వేలో వెల్లడించింది. సర్వే సమాచారం ప్రకారం.. 53 శాతం మంది వినియోగదారులు గత సంవత్సరం లేదా ఐదేండ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుత సోషల్‌ మీడియా స్థితి క్షీణించిందని నమ్ముతున్నారు. ”డిజిటల్‌ మార్కెటింగ్‌ కోసం సోషల్‌ మీడియా టాప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఛానెల్‌గా ఉన్నది. అయితే వినియోగదారులు తమ వినియోగాన్ని పరిమితం చేయటానికి చురుకుగా ప్రయత్నిస్తున్నారు” అని గార్ట్‌నర్‌ మార్కెటింగ్‌ ప్రాక్టీస్‌లో సీనియర్‌ ప్రిన్సిపల్‌ రీసెర్చర్‌ ఎమిలీ వీస్‌ అన్నారు.

➡️