- ఢిల్లీలో వివిధ పార్టీలకు వ్యవసాయ కార్మిక, దళిత, స్వచ్ఛంద సంఘాల విజ్ఞప్తి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో సామాజిక ప్రధానంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు చేర్చాలని రాజకీయ పార్టీలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు. శనివారం నాడిక్కడ దళిత సమస్యలపై ఏర్పడ్డ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు మల్లేపల్లి లక్ష్మయ్య, బి. వెంకట్, రాజ్యసభ ఎంపి వి.శివదాసన్, నిర్మల్, విక్రమ్ సింగ్, సాయిబాలాజీ, నటుప్రసాద్ తదితరులు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలసి డిమాండ్ చార్టర్ అందజేశారు. గతంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాలను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బి.వెంకట్ ఎపి, తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, దళితుల సమస్యలపై హైదరాబాద్లో వంద సంఘాలు, నాయకులు కలిసి దళిత్ సమ్మిట్ నిర్వహించామన్నారు. ఈ నెల 4న ”మార్చ్ టూ పార్లమెంట్” కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. దేశంలో బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలను కలిసి దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి, వారి సమస్యల పరిష్కారం గురించి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరాలని నిర్ణయించామన్నారు. అందులోభాగంగా బిజెపికి వ్యతిరేకంగా పని చేసే రాజకీయ పార్టీలతో సమావేశాలు జరుపుతున్నామన్నారు.