దుష్టశక్తులన్నీ ఏకమైనా వైసిపిదే విజయం : తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి-బూర్జ (శ్రీకాకుళం) : దుష్టశక్తులన్నీ ఏకమైనప్పటికీ అంతిమ విజయం వైసిపిదేనని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని లచ్చయ్యపేట గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక పార్టీలన్నీ ఏకమయ్యాయి అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కూటములుగా ఏర్పడినా సాధించేది ఏమీ లేదన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ముఖ్యంగా ఆముదాలవలస నియోజకవర్గంలో తాను ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టానని అన్నారు అభివృద్ధి సంక్షేమం రెండూ కావాలి అనుకుంటే వైసిపి కు పట్టం కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి ఎన్నికల హామీలను వివరించారు. తమ్మినేని సీతారాం ఈ ప్రచారంలో భాగంగా అచ్చమైన రైతన్నలా తలపాగ కట్టుకొని రైతులతో ముచ్చటించారు. ఆయనతోపాటు టీట్కో డైరెక్టర్‌ కే గోవిందరావు, జడ్పిటిసి బి రామారావు, వైస్‌ ఎంపీపీలు, బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణం నాయుడు కుమార్‌ పిఎసిఎ ఉన్నారు.

➡️