బిజెపికి వంత పాడుతూ..రాష్ట్రానికి వైసిపి, టిడిపి తీవ్ర అన్యాయం

Dec 30,2023 08:31 #cpm v srinivasarao, #speech

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా):బిజెపి వినాశకర విధానాలకు వంత పాడుతూ వైసిపి, టిడిపిలు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. అల్లూరి జిల్లా ఎటపాక మండలం కెఎన్‌.పురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వార్థపూరిత, సంకుచిత, తక్షణ ప్రయోజనాల కోసం ఆ పార్టీలు బిజెపి విధానాలను వ్యతిరేకించలేకపోతున్నాయన్నారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ తమ పార్టీ ఉనికిలో లేకుండా పోతుందోనన్న భయంతో మోడీకి ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపియేతర పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు టిడిపి చొరవ తీసుకోవాలని సూచించారు. లేదంటే ఆ పార్టీ రాష్ట్రంలో మనుగడ లేకుండా పోతుందని అన్నారు. వరదలు, తుపానుల వల్ల పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారికి నష్టపరిహారాన్ని ఇంతవరకు చెల్లించలేదని చెప్పారు. అంగన్‌వాడీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయకపోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు సమ్మెకు దిగారని తెలిపారు. వారి డిమాండ్ల పట్ల టిడిపి స్పష్టమైన వైఖరి తెలియజేయడం లేదని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలవరం నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నా వారిని పట్టించుకోకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు బూటకపు సర్వేలపై ఆధారపడి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనాలు వేసుకుంటున్నాయని విమర్శించారు. ఓట్లు వేసే ప్రజలను ఇలా గాలికొదిలేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, పార్టీ ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బప్పెన కిరణ్‌, జిల్లా నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, లోతా రామారావు పాల్గొన్నారు.

➡️