27న సింగరేణి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు : హైకోర్టు

Dec 21,2023 12:28 #Singareni election
  • అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డ ఎన్నికలు
  • ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు

హైదరాబాద్‌ : ఈనెల 27న సింగరేణి ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీంతో, డిసెంబర్‌ 27న ఎన్నికలు నిర్వహించాలని అప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరుతూ ప్రస్తుత ప్రభుత్వం పిటిషన్‌ వేయడంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని, అధికారులు బిజీగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకం కాదని హైకోర్టు తెలిపి.. ఈ నెల 27న యథావిధిగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి ఎన్నికల బరిలో మొత్తం 13 కార్మిక సంఘాలు నిలిచాయి. 3 సంఘాల మధ్య బలమైన పోటీ ఉంది. అక్టోబర్‌ నెలలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.

➡️