ఆట పట్ల చిత్తశుద్ధిని వైసిపి కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవు :చంద్రబాబు

  •  హనుమ విహారిని అండగా ఉంటామని హామీ

ప్రజాశక్తి- అమరావతి: ఆంధ్ర క్రికెట్‌ లో రాజకీయ జోక్యం ఎక్కువయిందని… భవిష్యత్తులో ఏపీ తరపున ఆడబోనని హనుమ విహారి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ నేత కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని విహారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌ వైసీపీ ప్రభుత్వంపై ట్వీట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

వైసీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్‌ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు. హనుమ విహారి ఒక తెలివైన భారత అంతర్జాతీయ క్రికెటర్‌ అని.. ఆయన ఏపీ తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రమాణ చేసే స్థాయికి టార్గెట్‌ చేయబడ్డాడని దుయ్యబట్టారు. హనుమా, మీరు దృఢంగా ఉండండి… క్రికెట్‌ పట్ల మీకున్న చిత్తశుద్ధి, కమిట్మెంట్‌ మీ గురించి ఎంతో గొప్పగా చెపుతాయని అన్నారు. ఈ అన్యాయమైన చర్యలు ఏపీ లేదా మన ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవని చెప్పారు. మేము మీకు ఎప్పుడూ అండగా ఉంటామని… మీకు న్యాయం జరగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

అధికార పార్టీ రాజకీయ జోక్యంతో ఆంధ్రా క్రికెట్‌ నుంచి హనుమ విహారి నిష్క్రమణ ఆశ్చర్యం కలిగిస్తోందని లోకేష్‌ అన్నారు. రెండు నెలల్లోనే ఏపీ తరపున తిరిగి ఆడటానికి రావాలని అతడిని ఆహ్వానింస్తామని.. విహారి, అతడి జట్టుకు రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతామన్నారు. ఆంధ్రా క్రికెట్‌ జట్టు రంజీ ట్రోఫీ గెలిచేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

➡️