తెలంగాణ సమరంలో సంకేతాలు, సందేహాలు

Nov 26,2023 07:18 #Editorial

2004 ఎన్నికలు విద్యుత్‌ ఉద్యమంలో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి వామపక్షాలతో కలసి పోరాడిన నేపథ్యం. అదే కేంద్రంలో యుపిఎ రావడానికి దోహదం చేసింది. ఈ వాస్తవాలను విస్మరించిన కాంగ్రెస్‌ ఒంటెత్తు పోకడ ఎలాంటి ఫలితాలకు దారితీసేది చూడవలసిందే. అలాగే తెలంగాణ సెంటిమెంటు, తమ సంక్షేమ పథకాలు, హైదరాబాద్‌ అభివృద్ధి, దిగుబడి పెరుగుదల వంటి వాటితో పాటు ప్రజలు సారు కారునే విశ్వసిస్తారన్న బిఆర్‌ఎస్‌ ఆఖరి ఆశలు ఫలిస్తాయా? బిజెపి పేరాశలను, పథకాలను ప్రజలు ఇప్పటికే విఫలం చేసినప్పటికీ ఎవరికీ మెజార్టీ రాని పరిస్థితే వస్తే ఏదో రూపంలో బిజెపి పట్టు బిగుస్తుందా అనేది కూడా ఫలితాలతో తేలాలి. ఇప్పటి వరకూ తెలుగు ప్రజలు అనిశ్చిత తీర్పులు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఆ వరవడే 2023 లోనూ పునరావృతమవుతుందా ?

తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాలలో పోలింగ్‌ ఈ నెలాఖరుతో ముగియనుంది. కొన్ని రాష్ట్రాలలో పోలింగ్‌ కూడా ముగిసిపోగా మిగిలిన చోట్ల ప్రచారం 28తో పూర్తయి నవంబరు 30న ఓటేయడానికి ప్రజలు సంసిద్ధులవుతున్నారు. ఈ రెండు రోజుల్లోనూ ప్రధానంగా తెలంగాణలో అన్ని పార్టీల అగ్రనాయకులూ పర్యటించనుండటంతో ప్రచారం తారాస్థాయికి చేరుతుంది. క్రమేణా రూపు మారుతున్న ప్రచార పద్ధతులూ, మీడియా సోషల్‌ మీడియా సాధనాలు, నాయకుల పర్యటనలూ అన్నీ హోరెత్తాయి. ప్రజల తీర్పు ఎలా వుంటుందనే దానిపై అనేక రకాల సర్వేలు వెలువడ్డాయి గానీ ఇవేవీ ప్రభంజనం వస్తుందని చెప్పలేదు. పాలక పార్టీ బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పగా కాంగ్రెస్‌ తప్పక విజయం సాధిస్తుందని రెండు మూడు సర్వేలు చెప్పాయి. ఎన్నికల తేదీ దగ్గరైన కొద్దీ బిఆర్‌ఎస్‌ అనుకూల సర్వేలు జోరందుకున్నాయి. టీవీ చర్చలలోనూ, కార్యక్రమాలలోనూ మొత్తంపైన సర్వేలను తోసిపారేయడమే గాక ఇవన్నీ ‘స్పాన్సర్డ్‌’ అనే రీతిలో ఎదురుదాడి చేస్తున్నారు. కానీ పార్టీలుగా మాత్రం అనుకున్న వాళ్లను రంగంలోకి దింపి రోజుకు రోజు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే ప్రయత్నాలు ఆపింది లేదు. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యనే ప్రధాన పోటీ అనేదానిపై ఏకాభిప్రాయం వున్నా తేడా మాత్రం పెరిగిపోతున్న స్థితి. కాంగ్రెస్‌ ప్రభంజనం నెలకొందన్న కథనాలతో అతి విశ్వాసం పెంచుకున్న ఆ పార్టీ ఇప్పటికీ అంతే నమ్మకంతో వుందా అనేది సందేహమే. ప్రచార పరంగా బిఆర్‌ఎస్‌కు కెసిఆర్‌, కెటిఆర్‌, హరీశ్‌లు ముగ్గురు మూడు కోణాలలో ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్‌ ప్రచార భారం పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రమే మోయవలసి వచ్చింది. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క మాత్రమే కొంత తోడు నిలిచారు. ముఖ్యమంత్రి ఎవరనే జాబితాలో ఈ ఇద్దరి పేర్లే ముందుండడం కూడా వాస్తవం. మిగిలిన జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటి రెడ్డి వంటి వారెవరూ రాష్ట్ర వ్యాపితంగా పర్యటించడానికి సిద్ధం కాలేకపోయారు. వారి కుటుంబ సభ్యుల సీట్లలోనే దిగబడిపోయారు. నల్గొండ జిల్లా వంటి చోటికి రేవంత్‌ రావడాన్ని స్వాగతించింది కూడా లేదు. కెసిఆర్‌ సహా బిఆర్‌ఎస్‌ నాయకులు కూడా రేవంత్‌పైనే అస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ కర్ణాటక తరహా వాగ్దానాలతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే బిఆర్‌ఎస్‌ ఉన్న పథకాల పెంపుతో పాటు కొన్ని కొత్త వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణ సాధన, అభివృద్ధి, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నవీకరణ తమ వల్లనే జరిగిందని కాంగ్రెస్‌ వస్తే ఇదంతా కొట్టుకుపోతుందని బిఆర్‌ఎస్‌ ప్రధాన పల్లవిగా వుంది. 30 మందికి పైగా పాత ఎమ్మెల్యేలను మార్చాలని అనేక సూచనలు వచ్చినా కేవలం పది మందిని మాత్రమే కొత్తవాళ్లను తీసుకున్న కెసిఆర్‌ నిర్ణయం ప్రభావం ఎన్నికల తర్వాత గాని తెలియదు. కొత్తగా టికెట్టివ్వడానికి అవకాశం లేకున్నా బిఆర్‌ఎస్‌ పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్థనరెడ్డి వంటి వారిని ఆఖరి క్షణంలో చేర్చుకుంది. విజయశాంతి వంటి వారి కాంగ్రెస్‌ ప్రవేశం కూడా అలాంటిదే. విధానపరమైన నిబద్దత, రాజకీయ విలువలు లేకపోవడం వల్ల ఎన్నికల పోరాటం కాస్త పదవుల కోసం ఆరాటంగానే తయారైంది.

క్రమేణా మారిన దృశ్యం

బిజెపి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగే జాతీయ పోరాటంలో బిఆర్‌ఎస్‌ ఒక కీలక భాగస్వామి అవుతుందనే నమ్మకం మునుగోడు ఎన్నిక కలిగించింది. ఆ సమయంలోనే ఆపరేషన్‌ ఫాంహౌస్‌, లిక్కర్‌ స్కాం కేసు వంటివి రంగం మీదకు వచ్చాయి. బిజెపి నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుటుంబంపైనా తీవ్ర స్థాయిలో దాడి చేశారు. రకరకాల కథనాల మధ్య ఈ వాతావరణం మారిపోయింది. కెసిఆర్‌తో సహా ఆ పార్టీ నేతలు ఇండియా, బిజెపిల మధ్య సమ దూరం సిద్ధాంతం తీసుకున్నారు. కాంగ్రెస్‌ మా ప్రధాన ప్రత్యర్థి గనక దానిపై కేంద్రీకరిస్తున్నామని చెప్పినా మోడీపై విమర్శ తగ్గించడం వాస్తవం. అయితే ఎన్నికల ప్రచారం చివరి దశలో మాత్రం దీన్ని కొంత సరిదిద్దుకుని తామెప్పుడూ లౌకిక పార్టీగానే వుంటామని కెసిఆర్‌, కెటిఆర్‌ ప్రత్యేకంగా ప్రకటించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆ మూలాలున్న వారి ఓట్ల ప్రభావం, కులపరమైన లెక్కలు నడిచినా ఆయనకు బెయిల్‌ రావడంతో అది తగ్గింది. ఉద్యోగాల భర్తీలో వెనకబాటే తమపై కొంత అసంతృప్తికి కారణమైందని బహిరంగంగానే వ్యాఖ్యానించిన కెటిఆర్‌ ఉద్యోగార్థులతో సహా వివిధ తరగతుల వారిని మోడీ తరహాలో ఇంటర్వ్యూలు చేస్తూ దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించారు. నిజానికి కెసిఆర్‌ గ్రామాలలో సభలు పెడుతుంటే కెటిఆర్‌ ఆ సభలతోపాటు నగర వాసులతో చానళ్లు, సోషల్‌ మీడియా ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం పెంచారు. మోడీ, అమిత్‌షాతో సహా బిజెపి నేతలు మాత్రం పాలక పార్టీపై దాడి కొనసాగించారు. మతతత్వ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ విద్వేషం రెచ్చగొట్టారు. కెసిఆర్‌ను అరెస్టు చేస్తామని బెదిరిస్తూనే వున్నారు. ఏమైనా వారి టార్గెట్‌ కాంగ్రెస్‌ అనేది స్పష్టం. హంగ్‌ వస్తుందని, అప్పుడు తాము బిఆర్‌ఎస్‌ను లోబర్చుకుని చక్రం తిప్పాలనీ ఆశపడుతున్నారు. వారి ఎత్తుగడలు ఏమైనా అసలు కాంగ్రెస్‌ శిబిరంలోనే ఐక్యత లేకపోవడం, అనేక మంది ముఖ్యమంత్రులు ముందుకు రావడం షరామామూలుగా సాగుతున్నది. మజ్లిస్‌ నేత ఒవైసీ బిఆర్‌ఎస్‌కే తమ మద్దతు వుంటుందని గట్టిగా ప్రకటించడమే గాక కాంగ్రెస్‌పై దాడి ఎక్కుపెట్టారు.

పేలవంగా జనసేన విన్యాసాలు

ఎ.పి లో టిడిపి నేస్తమైన పవన్‌ కళ్యాణ్‌ జనసేన బిజెపితో కలసి ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని, మోడీ మూడోసారి ప్రధాని కావాలని భక్తి చాటుకుంటున్నారు. అయితే ప్రచారం కూడా చేయకపోగా మొక్కుబడి పోటీతో జనసేన ఇక్కడ పలచనవడమే గాక ఎ.పి లోనూ నష్టపోతుందనే మాట అందరి నోటా వస్తోంది. రిజర్వేషన్‌ వర్గీకరణ పేరిట మందకృష్ణ మోడీని దళితోద్ధారకుడిలా కీర్తించడం కూడా విమర్శకు గురైంది. బిజెపి తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను తన చుట్టూ తిప్పుకోవడం కనిపిస్తుండగా కాంగ్రెస్‌ ఆ విధమైన వైఖరి తీసుకోవడంలో విఫలమైంది.

షర్మిల వైఎస్‌ఆర్‌టిపి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ టిజెఎస్‌లను కూడా పోటీకి దూరంగా వుంచింది. సిపిఐ కి ఒక్క స్థానం మాత్రం ఇచ్చి పొత్తు పెట్టుకుంది. బిఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుని జాతీయ పాత్ర నిర్వహిస్తామని హడావుడి చేసిన కెసిఆర్‌ తెలంగాణలో గెలవడం కోసం ప్రాంతీయ పార్టీగా పరిమితం చేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్‌ది కేవలం కల్పితమైన హైప్‌ మాత్రమేననీ తాము పూర్తి ఆధిక్యతతో గెలుస్తామని చెబుతున్న బిఆర్‌ఎస్‌ హంగ్‌ వస్తే బిజెపి మద్దతు తీసుకునేది లేదని మాత్రం చెప్పడం లేదు. మరో వంక కాంగ్రెస్‌లో కలిసిన మాజీ బిజెపి నేతలేమో తమ నాయకులు కెసిఆర్‌తో రాజీ పడినందుకే తాము బయిటకొచ్చామని ప్రకటిస్తున్నారు.

సిపిఎం కీలక ప్రభావం

బిజెపిని ఓడించడానికి, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటానికి 19 స్థానాల్లో స్వంతంగా రంగంలోకి దిగిన సిపిఎం పోటీలు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఫలితాలను కీలకంగా ప్రభావితం చేస్తాయి. మూడు శిబిరాల మధ్య స్వతంత్ర పాత్ర కాపాడుకుంటూ ఆత్మగౌరవం విధాన స్పష్టతతో ముందుకు పోవడం సిపిఐ పోటీ చేసే కొత్తగూడెంలో వారికే మద్దతునిస్తామని కూడా సిపిఎం చెప్పడం లౌకిక శక్తుల, వామపక్ష వాదుల మన్నన పొందుతున్నది. కాగా ఇదేదో బిఆర్‌ఎస్‌ కోసం చేస్తున్నట్టు వచ్చిన ఒక వర్గం మీడియా చేసిన ప్రచారాన్ని సిపిఎం గట్టిగానే ఖండించింది. ఈ పరిస్థితికి కారణమైన బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఆయా చోట్ల ఓట్ల చీలిక పర్యవసానాలకు మూల్యం చెల్లించవలసి వుంటుంది. బిఎస్‌పి కూడా రంగంలో వుంది. కొల్లాపూర్‌లో బర్రెలక్క పోటీ మరో ప్రత్యేకతగా వుంది. వీటన్నిటిపై ఓటర్లు ఎలా స్పందిస్తారో డిసెంబర్‌ మూడున కానీ తేలదు.

                                                                            ఒంటెత్తు పోకడల మూల్యం ?

కెసిఆర్‌ ప్రభుత్వంపై అనేక విమర్శలు, తప్పొప్పులు వున్నా ఆయనను గద్దె దించాలనీ, కాంగ్రెస్‌కు అవకాశమివ్వాలని ప్రజలు దృఢ నిర్ణయంతో వున్నారా అనేదానిపై రెండు రకాల వాదనలు కొనసాగుతూనే వున్నాయి. నిజానికి 1983లో ఎన్టీఆర్‌ టిడిపి స్థాపించిన తర్వాత ఇప్పటివరకూ ఉమ్మడిగా, విడిగా తొమ్మిది ఎన్నికలు జరిగితే అందులో మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. 2004 ఎన్నికలు విద్యుత్‌ ఉద్యమంలో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి వామపక్షాలతో కలసి పోరాడిన నేపథ్యం. అదే కేంద్రంలో యుపిఎ రావడానికి దోహదం చేసింది. ఈ వాస్తవాలను విస్మరించిన కాంగ్రెస్‌ ఒంటెత్తు పోకడ ఎలాంటి ఫలితాలకు దారితీసేది చూడవలసిందే. అలాగే తెలంగాణ సెంటిమెంటు, తమ సంక్షేమ పథకాలు, హైదరాబాద్‌ అభివృద్ధి, దిగుబడి పెరుగుదల వంటి వాటితో పాటు ప్రజలు సారు కారునే విశ్వసిస్తారన్న బిఆర్‌ఎస్‌ ఆఖరి ఆశలు ఫలిస్తాయా? బిజెపి పేరాశలను, పథకాలను ప్రజలు ఇప్పటికే విఫలం చేసినప్పటికీ ఎవరికీ మెజార్టీ రాని పరిస్థితే వస్తే ఏదో రూపంలో బిజెపి పట్టు బిగుస్తుందా అనేది కూడా ఫలితాలతో తేలాలి. ఇప్పటి వరకూ తెలుగు ప్రజలు అనిశ్చిత తీర్పులు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఆ వరవడే 2023లోనూ పునరావృతమవుతుందా?

తెలకపల్లి రవి

➡️