టిడిపి నిడదవోలు అభ్యర్థిగా శేషారావును ప్రకటించాలి

Feb 27,2024 14:32 #East Godavari, #TDP, #undragavaram
  • లేదంటే పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తాం!

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికలలో నిడదవోలు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును ప్రకటించాలని సూర్యారావు పాలెం సర్పంచ్‌, పంచాయతీ వార్డు సభ్యులు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు. లేదంటే పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా శేషారావును ప్రకటిస్తారన్న ఆశతో ఇంతకాలం ఎదురుచూశామని, అయితే శనివారం జనసేన, టిడిపి సంయుక్తంగా విడుదల చేసిన తొలి జాబితాలో శేషారావు పేరు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. రెండవ జాబితాలో తప్పనిసరిగా ప్రకటిస్తారనే నమ్మకంతో ఉన్న తమకు, రాజమండ్రి రూరల్‌ అభ్యర్థిని నిడదవోలుకు కేటాయిస్తున్నారని సమాచారం నెత్తిపై పిడుగుపాటుకు గురిచేసిందన్నారు. 15 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీకి విధేయుడుగా నడుచుకుంటూ, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి శేషారావు కనుక ఆయనకే సీటును కేటాయించాలన్నారు. లేనిపక్షంలో పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామన్నారు. ఈ సందర్భంగా బుధవారం చంద్రబాబు పాల్గొననున్న తాడేపల్లిగూడెం బహిరంగసభకు, శేషారావుకు మద్దతుగా భారీ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొనేందుకు వెళుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మెండే లలిత కుమారి, ఉప సర్పంచ్‌ నందిన శ్రీనివాస్‌, కరుటూరి మంగాయమ్మ, అంబటి శివకృష్ణ, నిమ్మగడ్డ రామకృష్ణ, కోనా ప్రసాదు, నిమ్మగడ్డ మోహనరావు, కూచిపూడి లీలా సత్యవేణి, తదితరులు పాల్గొన్నారు.

➡️