ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. వరుసగా ఆరు సెషన్లలో లాభాలతో నూతన రికార్డ్లను నమోదు చేశాయి. కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం బిఎస్ఇ సెన్సెక్స్ 69వేల మార్క్ను దాటి నూతన చరిత్రను సృష్టించింది. మరోవైపు నిఫ్టీ 21వేల చేరువలో నమోదయ్యింది. వరుసగా ఆరో సెషన్లోనూ లాభాలను నమోదు చేశాయి. తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 431 పాయింట్లు పెరిగి 69,296కు చేరింది. ఇంట్రాడేలో 69,381 గరిష్ట స్థాయి వద్ద ట్రేడింగ్ అయ్యింది. మరోవైపు నిఫ్టీ 168.30 పాయింట్ల వృద్థితో 20,855 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో 20 షేర్లు రాణించాయి. పవర్గ్రిడ్, ఎన్టిపిసి, ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, టైటన్, మారుతీ కంపెనీలకు చెందిన షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు హెచ్యుఎల్, హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటిసి స్టాక్స్ అధికంగా నష్టాలు చవి చూసిన వాటిలో టాప్లో ఉన్నాయి. ఒక్క పూటలోనే బిఎస్ఇ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.2.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.350 లక్షల కోట్ల మార్క్ దాటింది.