ఆధారాలు లేకుండా నగదు తరలిస్తే సీజ్‌

  •  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌
  •  ప్రకాశం జిల్లాలో పలు చెక్‌ పోస్టుల తనిఖీ

ప్రజాశక్తి-మద్దిపాడు, శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే సీజ్‌ చేసి ట్రెజరీలో జమ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఆయన గురువారం పరిశీలించారు. ముందుగా గుండ్లపల్లిలో వాహనాల తనిఖీ తీరు, ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేస్తున్న విధానంపై చెక్‌పోస్ట్‌లోని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సీజ్‌ చేసిన నగదు, ఇందుకు సంబంధించిన రికార్డులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం శింగరాయకొండ మండలం పాత శింగరాయకొండ వద్ద చెక్‌పోస్టును పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా అనుమానాస్పద వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. మహిళా ప్రయాణికుల బ్యాగులను కచ్చితంగా మహిళా సిబ్బందితోనే తనిఖీ చేయించాలన్నారు. జిల్లాలోని చెక్‌పోస్టుల పనితీరుపై సిఇఒ సంతప్తి వ్యక్తం చేశారు. చెక్‌పోస్టుల పనితీరును పరిశీలించి అవసరమైన సూచనలు చేయడానికి ప్రకాశం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజులపాటు తాను పర్యటిస్తున్నట్లు ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు.

➡️