ఒకే కుటుంబంలోఇరు పార్టీల సీట్లు

Apr 12,2024 07:05 #2024 elections, #TDP, #YCP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో కుటుంబ రాజకీయాలే నడుస్తున్నాయి. కుటుంబ రాజకీయాలు పోవాలంటూనే బంధుగణాన్ని బరిలోకి దింపుతున్నారు. టిడిపి, వైసిపి అధినేతలు కూడా కుటుంబ రాజకీయాలు చేసి పైకి వచ్చిన బాపతే. ఒకరు తండ్రి ఇమేజ్‌ ద్వారా ముఖ్యమంత్రి కాగా, మరొకరు మామ ద్వారా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.

నారా-నందమూరి బంధుత్వంలో ఐదుగురు
టిడిపిలో కుటుంబానికి ఒక్కటే సీటు అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ ఈ నిబంధన ఆయన కుటుంబానికి వర్తించలేదు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కొడుకు నారా లోకేష్‌ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం, ఆయన బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బాలకృష్ణ చిన్న అల్లుడు, ఎం భరత్‌ విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. నందమూరి, నారా కుటుంబాలతో బంధుత్వం ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి లోక్‌సభ నుంచి బిజెపి తరపున పోటీలో ఉన్నారు.

యనమల కుమార్తె, అల్లుడుకు టికెట్లు
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టిడిపి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె తణుకు నుంచి పోటీ చేస్తుండగా, ఆయన చిన్నల్లుడు ఏలూరు పార్లమెంటు నుంచి బరిలో ఉన్నారు. ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కడప జిల్లా మైదుకూరు నుంచి బరిలోకి దిగనున్నారు.

కింజరాపు కుటుంబానికి మూడు టికెట్లు
ప్రస్తుతం టిడిపి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి, ఆయన అన్న ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. రామ్మోహన్‌నాయుడు సోదరి భర్త ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నారు.

బరిలో వేమిరెడ్డి దంపతులు
ఇటీవల వైసిపి నుంచి టిడిపిలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కుటుంబం రెండు చోట్ల పోటీ చేయనుంది. నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఆయన పోటీ చేస్తుండగా, ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి కొవ్వూరు నుంచి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. నెల్లూరు సిటీ నుంచి మాజీమంత్రి పి నారాయణ బరిలో ఉండగా విశాఖపట్నం భీమిలి నుంచి ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు.
వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల శాసనసభ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన బాబాయి కొడుకు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కడప లోక్‌సభ నుంచి, ఆయన మేనమామ రవీంద్రనాథ రెడ్డి కమలాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. జగన్‌ కుటుంబంతోనే బంధుత్వం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేయనున్నారు.

బొత్స కుటుంబానికి నాలుగు టికెట్లు
మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి వైసిపిలో నాలుగు టికెట్లు దక్కాయి. చీపురుపల్లి నుంచి ఆయన పోటీ చేస్తుండగా, ఆయన భార్య బొత్స ఝాన్సీ విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి, సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం నుంచి, తమ్ముడు వరుసైన అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైసిపి తరపున పోటీ చేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ నరసన్నపేట నుంచి పోటీ చేయనున్నారు.

పెద్దిరెడ్డి కుటుంబానికి మూడు టికెట్లు
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి మూడు టికెట్లు దక్కాయి. పుంగనూరు నుంచి ఆయనకు తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి, రాజంపేట లోక్‌సభ నుంచి ఆయన కొడుకు ఎంపి మిథున్‌ రెడ్డి బరిలోకి దిగనున్నారు.

శిల్పా, చెవిరెడ్డి, మేకపాటి, అంబటి కుటుంబాలకు చెరో రెండు
కర్నూలు జిల్లాలో శిల్పా కుటుంబానికి, చిత్తూరులో చెవిరెడ్డి కుటుంబానికి, నెల్లూరులో మేకపాటి కుటుంబానికి, గుంటూరు జిల్లాలో అంబటి కుటుంబానికి రెండు టికెట్లు చొప్పున దక్కాయి. శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడి కుమారుడు శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి బరిలో ఉన్నారు. చంద్రగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఈసారి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీలో ఉండగా, ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి చంద్రగిరి నుంచి బరిలోకి దిగనున్నారు. మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి ఉదయగిరి నుంచి, ఆయన కుమారుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆత్మకూరు నుంచి బరిలో దిగనున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే జిల్లా పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా రాంబాబు సోదరుడు అంబటి మురళి పోటీ చేయనున్నారు.

విజయవాడలో అన్నదమ్ముళ్ల మధ్య పోటీ
విజయవాడ లోక్‌సభ నుంచి అన్నదమ్ముళ్లు పోటీపడుతున్నారు. 2019లో టిడిపి నుంచి గెలిచిన కేశినేని శ్రీనివాస్‌(నాని) ఇటీవల వైసిపిలో చేరారు. చేరిన వెంటనే వైసిపి లోక్‌సభ అభ్యర్థిగా ఆయన్ను ప్రకటించింది. ఇప్పుడు టిడిపి నుంచి అతని తమ్ముడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) బరిలో దిగనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు నుంచి కొలుసు పార్ధసారధి టిడిపి నుంచి బరిలో ఉండగా, ఆయన వియ్యంకుడు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కందుకూరు వైసిపి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీగా ఉన్న మురుగుడు హనుమంతరావు కోడలు మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు. లావణ్య తల్లి కండ్రు కమల గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

➡️