- డిఎస్ఎంఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరోసావిత్రిభాయి స్ఫూర్తితో రాజ్యాంగ హక్కులను, పోరాడి సాధించుకున్న రిజర్వే షన్లను కాపాడుకుందామని డిఎస్ఎంఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మనువాద మతోన్మాదుల పాలనలో రాజ్యాంగ హక్కులు కాల రాయబడుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తే రిజర్వేషన్లు లేకుండా చేస్తున్న తరుణంలో సావిత్రిభాయి ఫూలే స్ఫూర్తితో పోరాడి సాధించుకోవాలన్నారు. విజయవాడలోని ఫూలే అంబేద్కర్ భవనంలో బుధవారం సావిత్రిభాయి ఫూలే 193వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షత వహించారు. సభలో విఎస్ఆర్ మాట్లాడుతూ.. సమాజం అభివృద్ధి అసమానతలతో కూడుకుని ఉందని, దేశ సంపద కార్పొరేట్లకు దోచిపెడు తూ ప్రజలపై భారాలు మోపారన్నారు. రాజ్యాంగ చట్టాలను మారుస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారన్నారు. కుల వ్యవస్థను పెంచుతూ దళిత గిరిజనులపై దుర్మార్గమైన కుల దురహంకార దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళిత గిరిజనులపై దారుణమైన కుల దురహంకార దాడులు చేస్తున్నారని తెలిపారు. దళిత, గిరిజన ప్రజా ప్రతినిధులకు న్యాయం జగరడం లేదన్నారు. అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. చదువుల వల్లనే సమాజాభివృద్ధి ఉంటుందని ఫూలే భార్య సావిత్రమ్మకు చదువు నేర్పించి మొదట ఉపాధ్యాయులుగా స్కూలును ప్రారంభించి మహిళలు, బాలికలకు విద్యనందించారన్నారు. ఆమె జయంతి రోజున బాలికా అక్షరాస్యతా దినోత్సవంగా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జి క్రాంతికుమార్, ఉపాధ్యక్షులు జి నటరాజ్, సభ్యులు చింతల శ్రీనివాస్, జి అరుణ, నగర నాయకులు రారాజు, ఆంటోని, లాల్ఖాన్, కోటేశ్వరరావు, దేవ సహాయం, రాఘవేంద్ర పాల్గొన్నారు.