పార్ల్: భారత మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్(108: 113 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డే కెరీర్లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. కేశవ్ మహరాజ్ వేసిన 44వ ఓవర్ ఆఖరి బంతికి సంజూ సింగిల్ తీసి వందకు చేరువయ్యాడు. తిలక్ వర్మ(52), రింకూ సింగ్(38) కూడా రాణించడంతో భారతజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 296పరుగులు చేసింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్కు దిగిన టీమిండియాను నయా ఓపెనర్ రజత్ పటీధర్(22), సాయి సుదర్శన్(10) నిరాశపరిచారు. ఆ తర్వాత సంజు శాంసన్.. కెప్టెన్ కెఎల్ రాహుల్(21), తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సాయంతో స్కోర్బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సంజు శాంసన్ వన్డేల్లో తొలి శతకం, తిలక్ వర్మ తొలి అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 116 పరుగులు జోడించారు. మొదట్లో నిదానంగా ఆడిన ఈ ఇద్దరూ కుదరుకున్నాక ధాటిగా ఆడి జట్టు స్కోర్ 200 దాటించారు. టీమిండియా 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(21)ను మల్డర్ పెవిలియన్ పంపాడు. దాంతో, భారత్ 101 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహరాజ్ ఓవర్లో భారీ షాట్ ఆడి మల్డర్ చేతికి చిక్కడంతో తిలక్ ఖతర్నాక్ ఇన్నింగ్స్కు తెరపడింది. దాంతో, 217 రన్స్ వద్ద భారత్ నాలుగో వికెట్ పడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు హెండ్రిక్స్కు మూడు, బర్గర్కు రెండు, విలియమ్స్, ముల్డర్, మహరాజ్కు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్: రజత్ పటీధర్ (బి)బర్గర్ 22, సాయి సుదర్శన్ (ఎల్బి)హెండిక్స్ 10, సంజు శాంసన్ (సి)హెండ్రిక్స్ (బి)విలియమ్స్ 108, కెఎల్ రాహుల్ (సి)క్లాసెన్ (బి)ముల్డర్ 21, తిలక్ వర్మ (సి)ముల్డర్ (బి)మహరాజ్ 52, రింకు సింగ్ (సి)హెండ్రిక్స్ (బి)బర్గర్ 38, అక్షర్ (సి)ముల్డర్ (బి)హెండ్రిక్స్ 1, సుందర్ (సి)మార్క్రమ్ (బి)హెండ్రిక్స్ 14, ఆర్ష్దీప్ సింగ్ (నాటౌట్) 7, ఆవేశ్ ఖాన్ (నాటౌట్) 1, అదనం 22. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 296పరుగులు. వికెట్ల పతనం: 1/34, 2/49, 3/101, 4/217, 5/246, 6/255, 7/277, 8/293
బౌలింగ్: బర్గర్ 9-0-64-2, విలియమ్స్ 10-0-71-1, హెండ్రిక్స్ 9-0-63-3, ముల్డర్ 7-0-36-1, మహరాజ్ 10-2-37-1, మార్క్రమ్ 5-0-19-0